కరోనా మహమ్మారి బారిన సామాన్యులు, ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో పాటు జర్నలిస్ట్ లు పడుతున్నారు. కరోనా బారిన పడుతున్న వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, పోలీస్ తదితర శాఖల వారికి ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ ఇతర వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనా బారిన పడిన జర్నలిస్ట్ లకు ఆర్ధిక సహాయం అందిస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 337 మండి జర్నలిస్ట్ లు కరోన వైరస్ బారిన పడగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ద్వారా 59 లక్షల 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
పాజిటివ్ వచ్చిన 256 మంది జర్నలిస్టులకు ఇరవై వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పది వేల రూపాయల వంతున 8 లక్షల 10 వేల రూపాయలను అందించారు. సోమవారం నాటికి వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా తాజాగా 72 మందికి పాజిటివ్ వచ్చిందని, మరో నలుగురు జర్నలిస్టులు హోంక్వారంటైన్ లో ఉండవలసిందిగా వైద్యాధికారులు సూచించారు. వారికి 14 లక్షల 80 వేల రూపాయలు ఆర్థిక సహాయం జర్నలిస్టుల బ్యాంకు ఎకౌంట్ లో ఆన్ లైన్ ద్వారా జమ చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ తెలిపారు. తెలంగాణలో కరోనా బారిన పడ్డ జర్నలిస్ట్ మిత్రులు తమ వివరాలను తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ వాట్సప్ 8096677444 నెంబర్ కి పంపాలనీ, మరిన్ని వివరాలకు మీడియా అకాడమీ మేనేజర్ లక్ష్మణ్ కుమార్ సెల్ నెంబర్ 9676647807 ని సంప్రదించవచ్చని చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు.
తెలంగాణలో ఈ విధంగా జర్నలిస్ట్ మిత్రులకు ఆర్ధిక సహాయం చేస్తుండగా… ఏపిలో ఆ ఉసే లేదు. ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్ట్ లు కరోనా బారిన పడటం లేదా?,ఏపి ప్రెస్ అకాడమీ లేదా? అన్న అనుమానం రావచ్చు. ఏపిలోనూ ఇప్పటికి వందల సంఖ్యలోనే జర్నలిస్ట్ లు కరోనా బారిన పడినట్లు సమాచారం. అయితే ఏపి ప్రెస్ అకాడమీ.. తెలంగాణలో మాదిరిగా ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమం చేపట్టకపోవడంతో ఎంత మంది కరోనా బారిన పడ్డారు అనేది ఫిగర్స్ అందుబాటులో లేవు. అయితే కరోనా కారణంగా ఎనిమిది మంది జర్నలిస్ట్ లు ఏపిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏపిలోనూ ప్రెస్ అకాడమీ ఉంది. చైర్మన్ గా నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి గత ఏడాది నవంబర్ నెలలో బాధ్యతలు చేపట్టారు.
ప్రభుత్వంతో అనుకూలంగా అనేక మంది రాష్ట్ర, జాతీయ స్థాయి జర్నలిస్ట్ సంఘ నేతలు ఏపిలో ఉన్నప్పటికీ తెలంగాణలో మాదిరిగా కరోనా బారిన పడిన జర్నలిస్ట్ లను అదుకోకపోవడం నిజంగా శోచనీయమే. సో..కాల్డ్ పెద్దలు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి ఉంటే అయన సానుకూలంగా స్పందించే వారనీ తెలుస్తోంది. ప్రయత్నలోపమే ప్రధాన కారణం కావొచ్చు.