కరోనా వైరస్ వల్ల దేశ వ్యాప్తంగా అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రంగాల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో విద్యార్థులను అప్పుడే బడిలోకి పంపేందుకు తల్లిదండ్రులు కూడా విముఖంగా ఉన్నారు. ఈ లోపల ఆన్ లైన్ బోధనకు ప్రైవేట్ స్కూళ్ళు మొగ్గు చూపుతున్నాయి. అయితే పిల్లల భవిత్యం పై తల్లిదండ్రులందరికీ ఇప్పటికీ బెంగ గానే ఉంది. అయితే ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం స్కూళ్ళ నిర్వహణపై ఒక క్లారిటీలి వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే దూరదర్శన్ ద్వారా పాఠాలను విద్యార్థులు ఇంటి వద్దనే ఉంటూ నేర్చుకునేలా ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం… ఆగస్టు 3 నుంచి ఆన్లైన్ విద్యాసంవత్సరం ప్రారంభించాలని సూచిస్తోంది. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో దానితో సంబంధం లేకుండా ఇళ్లలోనే ఉంటూ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా చదువుకునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే సప్తగిరి ఛానెల్ లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులను రోజుకు 6 గంటలకు ప్రసారం చేస్తున్నారు. వీటిని ఇక మీదట కూడా కొనసాగిస్తారు.
ఈ నెల ఆఖరి లోపల ఈ ఏర్పాట్లు అన్నీ పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది మే నెల రెండవ వారం వరకు విద్యా సంవత్సరం ఇలాగే కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే దసరా, సంక్రాంతి సెలవులను కూడా పరిమితం చేస్తారు. మొత్తం 180 రోజుల పనిదినాలు ఉంటాయి. మధ్యలో వచ్చే సెలవులను కూడా తగ్గిస్తారు. సిలబస్ లో భారీగా మార్పులు రానున్నాయి. విద్యార్దుల స్కూల్ టైమ్ పని దినాలు తగ్గడంతో ఆ మేరకు వారిపై ఒత్తిడి లేకుండా సిలబస్ లోనూ 30 శాతం కోత విధిస్తారు.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం దూరదర్శన్ సప్తగిరి మన టీవీ ఛానళ్లలో ప్రతీ రోజూ పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయి. వాటిని విద్యార్ధులు ఫాలో కావాల్సి ఉంటుంది. మధ్యలో సందేహాలు వచ్చినప్పుడు టీచర్లను సంప్రదించేందుకు అన్ని ఆన్ లైన్ పద్దతులను అందుబాటులోకి తీసుకొస్తారు.
వచ్చే సంవత్సరం పదవ తరగతి పరీక్షలను ఏప్రిల్ లో నిర్వహిస్తారు. అలాగే 6 నుంచి 9వ తరగతి వరకూ పరీక్షలను మే నెలలో నిర్వహిస్తారు. మే రెండో వారం నుంచి వేసవి సెలవులను ప్రకటిస్తారు. జూన్ 10 నుంచి యథావిదిగా వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభించనున్నారు. దీనికి అనుగుణంగా అకనమిక్ క్యాలెండర్ నూ సిలబస్ నూ త్వరలో పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేయనున్నారు.