ఒక బిడ్డని కనడం ఎంత కష్టమో… ఆ బిడ్డని సాకి ప్రయోజకున్ని చేయడం, సమాజానికి ప్రయోజకారిగా మార్చడం అంత కష్టం. అది చేసినప్పుడే తల్లిదండ్రులుగా పరిపూర్ణులు కాగలరు…!!
ఒక పథకం.. ఒక ప్రాజెక్టు… ఒక కార్యక్రమం… పురుడు పోసుకోవడం కష్టమైతే… దాన్ని శాశ్వతకాలం ఫలవంతంగా అమలు చేసి ఉత్తమ ఫలితాలు సాధించడం మరింత కష్టం. రాజకీయ వైరుధ్యాలు, వైషమ్యాలు మధ్య ఎంత మంచి పథకాలైనా, ప్రాజెక్టులైనా కొట్టుకుపోతాయి. అటువంటి కోవలోకే వస్తుంది 108 సేవలు కూడా. 2005 లో ఆరంభమై.. 2011 లో కొంత నిర్వీర్యమై.., 2015లో పూర్తిగా నిర్వీర్యమై.., 2020 లో మళ్ళీ పునర్జన్మ ఎత్తిన ఈ సర్వీసుల గురించిన రాజకీయ తెలుసుకోవాల్సిందే.
వైఎస్సాఆర్ టైంలో ఆరంభం ఇలా…!
అది ఆగష్టు 15, 2005… 800 వాహనాలు పక్కపక్కనే వున్నాయి, వాటి పై 108 అంకె వుంది. అవేమిటో, ఎందుకో సాధారణ జనాలకు, కొందరు పాలకులకు కూడా తెలియదు. కానీ అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డికి మాత్రమే వాటిపై ఒక ఆలోచన ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రి ఒక వైపు, ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఒక వైపు ఉండి జెండా ఊపి నాడు ఆ సర్వీసులను ప్రారంభించారు. అవి అన్ని విశిష్టతలు కలిగివుంటాయని, ఇన్ని ప్రాణాలను నిలబెడతాయని…, కేవలం పది నిమిషాలలోనే ప్రమాద స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రులకు చేరుస్తాయని ఏ ఒక్కరు అనుకోలేదు. కానీ ఏడాది లోనే వాటి ఫలితం ఏంటి అనేది రాష్ట్రానికి తెలిసి వచ్చింది. 2006 ఆగష్టు వచ్చేసరికి సుమారుగా 70,000 మందిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చాయి. వీటిలో దాదాపు 12 వేల మంది ప్రాణాలను నిలబెట్టాయి. అలా ఆ సర్వీసుల విలువ తెలిసి వచ్చి… పక్క రాష్ట్రాల్లో కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ హయాంలోనే కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో ప్రారంభించి, గుజరాత్ లో మోడీ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు కూడా ప్రారంభించి 108 సర్వీసులు దేశ వ్యాపతంగా అమలు అవడానికి రాజశేఖర రెడ్డి నాంది పలికారు. నిజానికి రాజశేఖర్ రెడ్డి కంటే ముందే సత్యం రామలింగరాజుకు ఈ ఘనత దక్కేది. 2003లోనే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లో రామలింగరాజు సొంత మండలంలో విస్తరించేలా తన తండ్రి పేరిట ఉచిత సర్వీసులు ప్రారంభించారు. ఇది బాగా విజయవంతం అవ్వడంతో రాజశేఖర్ రెడ్డి దీనిని గమనించి దీనిని రాష్ట్ర వ్యాప్తంగ అమలు చేసి, దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి బీజం వేశారు. ఈ కథ ఇంతటితో ముగిస్తే…
తర్వాత నిర్వీర్యం ఇలా…!
రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం 108 సర్వీసులు, ఆరోగ్యశ్రీ సేవలు ఎంత ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు. ఆయన మరణం తర్వాత ఆయన పేరు అంతగా చెప్పుకోవడానికి ఈ రెండు కారణమయ్యాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన కె.రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కూడా వీటిని సక్రమంగా అమలు చేయడానికి ప్రయత్నించి కొంతవరకు విఫలమయ్యారు. సకాలంలో బిల్లులు చెల్లించలేక, నిర్వహణ ఛార్జీలు ఇవ్వలేక, చివరిదశలో చేతులెత్తేయడంతో 2013 నుంచి ఈ సర్వీసులు క్రమేణా మూలకు చేరడం ప్రారంభమైంది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సర్వీసులు మరింత కష్టకాలంలో కి వెళ్ళాయి. చంద్రబాబు సమయంలో ఇతర ఆరోగ్య పథకాలకు బాగానే వెచ్చించినప్పటికీ 108 పై రాజశేఖర్ రెడ్డి అనే బ్రాండ్ ఉండడంతో చంద్రబాబు వీటిని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. దీంతో 2016 నాటికే 108 వాహనాల్లో 20 శాతం వరకు మూలకు చేరాయి. 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత 2016 అంటే రెండేళ్ల కాలంలోనే రాష్ట్రవ్యాప్తంగా 380 వాహనాలు స్క్రాప్ దశకు వెళ్లాయి. అంటే ఆ వాహనాలు తుప్పు పట్టి, టైర్లు లేక, అత్యంత స్క్రాప్ దశకి చేరుకున్నాయి. ఆ తర్వాత వీటి నుంచి నలువైపులా విమర్శలు రావడంతో చంద్రబాబు తేరుకొని 2016లో దీనిపై దృష్టి పెట్టి జీవీకే సంస్థ నుంచి బివిజి అనే మరో సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ సంస్థ వచ్చిన తర్వాత సర్వీసులు బాగుపడతాయని అని అనుకుంటే… వీటికి కూడా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో , నిర్వహణ చార్జీలు లేక 108 సర్వీసులు ఆరు నెలలోనే మళ్ళీ మూలకు చేరాయి. డీజిల్ కూడా లేక ఎవరు ఫోన్ చేసినా అందుబాటులో లేదని, డ్రైవర్ అందుబాటులో లేదని ముప్పుతిప్పలు పడ్డాయి. 2019 చంద్రబాబు పరిపాలన వరకు ముగిసే వరకు కూడా 108 సర్వీసులు ఆశించినంత ఫలితాలు. జివికె సంస్థ నుండి తీసుకుని బివిజి కి ఇవ్వడంతోనే చంద్రబాబుపై విమర్శలు వచ్చాయి.
జగన్ ముద్రకు మళ్ళీ మొదలు…!
108 సర్వీసులను తండ్రి తరహాలోనే విజయవంతంగా అమలు చేయాలంటే ముందుగా ప్రక్షాళన చేయాలని భావించిన జగన్మోహన్ రెడ్డి ,ఆ దిశగా బీవిజె సంస్థను తప్పించి అరబిందో ఫార్మా కంపెనీ కి అప్పగించారు. సిద్ధం చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసులను నిన్న ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లాకు సగటున 30 వాహనాలు ఉండేలా చూసుకుని.., మొత్తం నాలుగు వేల వాహనాలు.., అలాగే ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉండేలా జగన్ చర్యలు తీసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఆరోపణలు… ప్రభుత్వం సమాధానాలు …
108 వాహనాలు నిర్వహణకు తెలుగుదేశం పార్టీ బివిజి సంస్థకు వాహనానికి లక్ష 43 వేల చొప్పున కేటాయించింది ఇచ్చేది. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్షా 78 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుంది . అంటే దాదాపు 35000 అదనం. విజయసాయిరెడ్డి వియ్యంకుడి కి చెందిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన కారణంగానే ఈ నగదు అదనంగా ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే వాహనాల మీద కలిపి 307 కోట్ల వరకు అవినీతి జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరామ్ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలందరూ దీనికే వంత పాడారు, అయితే దీనికి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం విడుదల చేసింది. 108 సర్వీసులు నిర్వహించిన సమయంలో డ్రైవర్ లకు వేతనాలు 18000 అందజేసే వాళ్ళు… కానీ ప్రస్తుతం 28,000 కి దాన్ని పెంచారు. అలాగే సిబ్బంది వేతనాలు కూడా 20 వేల నుంచి 30 వరకు పెంచారు. ఇలా వేతనాలు పెంచిన కారణంగా సిబ్బంది మరింత సానుకూల దృక్పథంతో పనిచేస్తారు అనే కారణంతో ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే వేతనాలు పెంచినప్పుడు నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ 43,000 అదనంగా పెట్టాల్సి వచ్చింది అనేది ప్రభుత్వ వాదన .అలాగే విజయ సాయి రెడ్డి పుట్టినరోజున ఈ సర్వీసులల్ని ప్రారంభించారు అని ఆరోపిస్తే ఆ రోజు ప్రపంచ వైద్యుల దినోత్సవం అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేసింది. 108 సర్వీస్ కేటాయింపు లో ఓపెన్ టెండర్ పిలిస్తే కేవలం అరబిందో ఫార్మా మాత్రమే టెండర్ వేయడంతో ఆ సంస్థ పనితీరు పరిశీలించిన ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా కట్టబెట్టింది. ఇలా తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు, ప్రభుత్వ సమాధానాలతో 108 సర్వీసులు కాస్త మరింత హైలైట్ అయ్యాయి. వాటికి తగ్గట్టుగా జగన్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా… చాలా ప్రచారం కల్పిస్తూ ప్రారంభించారు. నిజానికి ప్రచార యావలో చంద్రబాబును మించిన జగన్… తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలన్నీ సమాధానలిస్తూనే వీటిని ప్రజల ముందుకు వదిలారు. మొత్తానికి అష్టోత్తర శత (108) కష్టాలను దాటుకుని ఈ 108 సర్వీసులు ప్రజల ముందుకు వచ్చాయి పూర్వం కంటే మరింత బాగా పని చేస్తాయని ఆశిద్దాం. అష్టోత్తర నామావళితో పూజించి మరీ ఆశిద్దాం. ఎందుకంటే ఇది రాజకీయం కాదు, ప్రాణం నిలబెట్టే వాహనం. ఇది నాయకుడిది కాదు, పేదోడిది.