(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్తో సమావేశమైయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివరించినట్లు తెలుస్తోంది. ఒక పక్క ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గవర్నర్ ను కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ విషయాలు గురించి కూడా గవర్నర్కు తెలియజేసినట్లు సమాచారం. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ సిద్ధంగా ఉందని గవర్నర్కు ఎస్ఈసీ తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏపి మాత్రం ప్రభుత్వం కరోనాను సాకుగా చూపుతోందని నిమ్మగడ్డ గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్ తో సమావేశం ముగిసిన తరువాత నిమ్మగడ్డ నేరుగా ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక ఎన్నికలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం మద్య జరుగుతున్న వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరంగా మారాయి.