అనంతపురం: సీనియర్ నేత, మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డికి రవాణా శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయన్న అభియోగంతో దివాకర్ రెడ్డి ట్రావెల్స్కు చెందిన 23 బస్సులను సీజ్ చేయడంతో పాటు ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు.
కమిషనర్ సీతారామాంజినేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్దంగా బస్సులు నడుస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు గుర్తించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం తో పాటు ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేస్తున్నట్లు గమనించారు.
దివాకర్ ట్రావెల్స్పై అనేక ఫిర్యాదులు వచ్చాయనీ, అందులో భాగంగానే తనిఖీలు చేశామనీ, విచారణ కొనసాగుతుందనీ రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాద్ రావు తెలియచేసారు.