అయోధ్య రామమందిర నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. మార్చిలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభం కావల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి, లాక్డౌన్ కారణంగా పనులను వాయిదా వేశారు. అయితే వచ్చే నెలలోనే మందిరం నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు గాను త్వరలో తేదీలను ప్రకటించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శి, రామ మందిరం నిర్మాణ కమిటీ హెడ్ నృపేంద్ర మిశ్రా తాజాగా అయోధ్యకు చేరుకున్నారు.
కాగా అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజకు రావాలని ప్రధాని మోదీకి ఇప్పటికే మందిరం ట్రస్టు సభ్యులు ఆహ్వానం పంపారు. ఇక శనివారం భూమి పూజ జరిగే తేదీని నిర్దారించనున్నారు. ఈ క్రమంలో నృపేంద్ర మిశ్రా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుతో సమావేశం కానున్నారు. అలాగే నిపుణులైన ఇంజనీర్ల బృందం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగే స్థలాన్ని కూడా పరిశీలించనుంది.
ఇక రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ గర్భ గృహంలో జరగనుంది. ఆ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు మంత్రులు, ఎంపీలు, రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే భూమి పూజలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా అయోధ్యకే వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని నిర్మాణ కమిటీ సభ్యులు కోరుతున్నారు. అయితే మోదీ ఈ విషయంలో ఏం చేస్తారో చూడాలి. ఇక భూమి పూజ జరిగే తేదీ వివరాలను శనివారం జరిగే సమావేశంలో నిర్ణయిస్తారని తెలుస్తోంది.