దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకోకుండా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుండటం, వాటి అమలు కోసం పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం, ఆర్బీఐ నుండి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల రుణ సదుపాయాలను వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే శాఖల మంత్రి పీయూష్ గోయల్కు ఆయన వేరువేరుగా లేఖలు రాయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ నరేష్ కుమార్ ఇటీవల తనకు లేఖ రాశారంటూ దానిని తన లేఖలో జత చేశారు సురేష్ ప్రభు.
రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ ఉచిత పథకాలకు వినియోగిస్తున్న నిధులను రాష్ట్ర ఆధీనంలోని కార్పోరేషన్ల నిధుల నుండి మళ్లిస్తున్నారనీ, ఇలా కార్పోరేషన్ల నిధులను సంక్షేమ పథకాలకు తరలించడం వల్ల ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుందని తద్వారా అభివృద్ధి క్షీణిస్తుందని సురేష్ ప్రభు ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితి దాటి సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి కఠినంగా అమలు చేయడంతో పాటు పర్యవేక్షణ ఉండాలని నరేష్ కుమార్ కోరినట్లు సురేష్ ప్రభు పేర్కొన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే రుణాలకు 200 శాతం రిజిస్టర్డ్ మార్ట్ గేజ్ విలువతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించగలగే సామర్థ్యం ఉందో లేదో కూడా ప్రతి సంవత్సరం పరిశీలించాల్సి ఉందన్నారు. అదే విధంగా సిబిల్ పరిమితిని కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నరేష్ కుమార్ సూచనలకు ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్న సురేష్ ప్రభు…పరిస్థితులు చేయి దాటకముందే కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు.