Breaking: దేశ రాజధాని ఢిల్లీలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్రలో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. వాయువ్య డిల్లీలోని జహాంగీర్ పుర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ఉరేగింపు జరుగుతున్న సందర్భంలో అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. ఈ దాడిలో పలువురు వ్యక్తులతో పాటు పోలీసులు గాయపడ్డారు. కొన్ని వాహనాలకు దుండగులు తగులబెట్టారు. ఈ ఘటనలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడి హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు సమాచారం అందించారు. ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ అవసరమైన ఆదేశాలు ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఈ అల్లర్లపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ప్రజలు అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. లెప్టినెంట్ గవర్నర్ తో ఫోన్ లో మాట్లాడినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. శాంతి భద్రతల కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్తానా అన్నారు. పరిస్థితి అదుపులో ఉందనీ, జహంగీర్ పురి తో సహా ఇతర సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మొహరించినట్లు చెప్పారు. సీనియర్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి శాంతి భద్రతలను నిశితంగా పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్ చేపట్టాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు వార్తలను పౌరులు పట్టించుకోవద్దని రాకేశ్ అస్తాన్ పేర్కొన్నారు. అల్లరి మూకల దాడి ఘటనను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఘటనపై డిల్లీ పోలీస్ కమిషనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో చర్చించారు.