By Polls: ఇటీవల అయిదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయాలు నమోదు చేసుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఉప ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. నాలుగు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. అయితే ఒక్క అసెంబ్లీ స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీ రెండవ స్థానంలో నిలిచి పరువు కాపాడుకుంది.
By Polls: 2 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం
ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, బీహార్ లలోని ఒక్కొ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పశ్చిమ బెంగాల్ లోని ఒక అసెంబ్లీ స్థానంతో పాటు ఒక లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని ఖైరాగఢ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి యశోదా నీలంబర్ వర్మ 53.55 శాతం ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అదే విధంగా మహారాష్ట్రలోని నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి జాదవ్ జయశ్రీ చంద్రకాంత్ 53.93 ఓట్ల శాతంతో ఘన విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి మద్దతుగా ఎన్సీపీ, శివసేన పోటీకి దూరంగా ఉన్నాయి. ఇక బీహార్ లోని బొచహన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆర్ జేడీ అభ్యర్ధి అమర్ కుమార్ పాశ్వాన్ 48.52 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్ధిపై విజయం సాధించారు.
ఇక పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. అసన్ పోల్ లోక్ సభ స్థానం నుండి టీఎంసీ అభ్యర్ధి శత్రుఘన్ సిన్హా విజయం సాధించారు. గతంలో బీజేపీ నేత అయిన సిన్హా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత కొద్ది రోజుల క్రితం టీఎంసీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక బల్లిగంగె అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ నుండి టీఎంసీలో చేరిన సింగర్ బాబూల్ సుప్రియో సీపీఎం అభ్యర్ధి పై 49.22 శాతం ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.