ఇటీవల వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. వేలాది కాలనీలు, ఇళ్లు ముంపుకు గురైయ్యాయి. ప్రాణనష్టం, భారీగా ఆస్తినష్టం సంభవించింది. పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున విరాళం కూడా అందించారు. అదే మాదిరిగా సీఎం కేసిఆర్ పిలుపుతో వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నష్టాన్ని అంచనా వేసేందుకు నేడు కేంద్ర బృందం హైదరాబాదుకు చేరుకున్నది.
కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలో హైదరాబాదుకు వచ్చిన అధికారుల బృందం రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నది. తొలుత ఈ బృందం సచివాలయం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులతో సమావేశమైంది. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లు సమావేశంలో పాల్గొన్నారు. భారీ వర్షాలు, వరదల వలల్ జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను కేంద్ర బృందానికి అధికారులు వివరించారు. నష్టానికి సంబంధించి ఫోటోలను ప్రదర్శించారు. సమావేశం అనంతరం ఈ బృందం రాష్ట్ర అధికారులతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పరిశీలన చేస్తున్నది.