(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” బ్యూరో)
ఏపిలో ఇప్పట్లో ఎన్నికలు అయితే లేవు. కానీ రాజకీయ వాతావరణం వాడివేడిగానే ఉంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాకతో వైసీపీ ప్రభుత్వానికి కస్తా కూస్తో అనుకూలంగా ఉంటారని అందరూ భావించారు. కానీ ఇటీవల హిందూ ఆలయాలపై జరిగిన దాడుల నేపథ్యంలో వారి మధ్య అంతర్గతంగా ఉన్న స్నేహం దెబ్బతిన్నట్లుగా కనబడుతోంది. అంతర్వేది ఘటన తరువాత వరుసగా నాలుగైన ఘటనలు జరగడం, ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో బిజెపి, హింధూ సంఘాల నేతలపై కేసులు, పెట్టడం, అరెస్టులు చేయడం వివాదం ముదురుతోంది. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం హింధూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందంటూ సోము వీర్రాజుతో సహా పలువురు బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ ప్రభుత్వంపై ఒకటి రెండు సార్లు మినహా గట్టిగా మాట్లాడని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు సైతం నేడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక చర్చిపై ఎవరో రాళ్లు వేశారనీ 41 మంది హిందువులను అరెస్టు చేసిన ప్రభుత్వం హింధూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే అందుకు బాధ్యులైన వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు.
వైసీపీ, బిజెపి మధ్య నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణాన్ని టీడీపి అడ్వంటేజ్ గా తీసుకోవాలని బిజెపి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రాబోయే ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో బిజెపి, కాంగ్రెస్ యేతర పక్షాలతో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ ముందుగానే కెసిఆర్ కు జై కొట్టారు. తృతీయ ఫ్రంట్ కు కెసిఆర్ నాయకత్వం వహిస్తే తాము కలిసి నడుస్తామన్నట్లు ప్రకటించారు నారాయణ, తృతీయ ఫ్రంట్ ఆలోచన ఇప్పట్లో ఏమీలేదని కెసిఆర్ అన్నట్లు వార్తలు వచ్చినా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఢిల్లీలో ఎన్ డి ఎ వ్యతిరేక పక్షాల నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారని అంటున్నారు.
అయితే గత అనుభవాల దృష్ట్యా టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం తృతీయ ఫ్రంట్ కు దూరంగా ఉండాలనీ, బిజెపితోనే సఖ్యతగా ఉంటేనే బెటర్ అన్నట్లుగా పావులు కదుపుతున్నారని సమాచారం. ఓ పక్క చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి బిజెపి డోర్ లు మూసేశామమని, ఆయన వస్తామన్నా తాము కలవనివ్వమంటూ ఆ పార్టీ నేతలు పేర్కొన్నా చంద్రబాబు మాత్రం బిజెపితో కలిసి ప్రయాణించడానికే మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఆ తరువాత రాష్ట్ర విభజన తరువాత గానీ బిజెపితో తెగతెంపులు చేసుకుని ఎన్నికలలో దిగిన ప్రతి సారి టీడీపీ పరాజయం పాలైంది. బిజెపితో కలిసి పోటీ చేసినప్పుడే అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అధికార వైసీపి రాష్ట్రంలో బిజెపి నేతలతో పడినా పడకపోయినా కేంద్రం స్థాయిలో సన్నిహిత సంబంధాలనే నెరుపుతున్నది. రాజ్యసభలో పలు కీలక బిల్లుల సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగానే వ్యవహరిస్తూ వస్తున్నది. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటునమ్మ వాయనం అన్నట్లు కేంద్రంలోని బిజెపికి వైసీపీ సహకరిస్తోంది, ఇక్కడి రాష్ట్రంలోని మూడు రాజధానుల అంశంలోనూ కేంద్రం అడ్డుచెప్పకుండా తోడ్పాటు అందిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజులో పరిస్థితులు ఎలా ఉంటాయనేది రాజకీయ వర్గాల్లో ఆశక్తిని రేపుతున్నది.