గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఫైర్ బ్రాండ్, మహిళా మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ రాజకీయం ఆసక్తిగా మారుతోంది. రజనీ వైసీపీలో చేరినప్పటి నుంచి పట్టిందల్లా బంగారం అవుతోంది. చిలకలూరిపేట నుంచి ఆమె గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి అనూహ్యంగా వైసీపీ కండువా కప్పుకుని మరీ సీటు దక్కించుకున్నారు. అనూహ్యంగా రెండున్నరేళ్ల తర్వాత ఆమె జగన్ కేబినెట్లో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి పదవి దక్కించుకున్నారు.
ఇక ఇప్పుడు ఎన్నికలకు ముందు చిలకలూరిపేటలో ఆమెపై వ్యతిరేకత ఎక్కువుగా ఉందని గ్రహించిన పార్టీ అధిష్టానం ఆమెను గుంటూరు వెస్ట్కు మార్చింది. గుంటూరు వెస్ట్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన రజనీ అక్కడ పార్టీ కార్యక్రమాలు స్పీడప్ చేస్తూ దూసుకుపోతున్నారు. వెస్ట్లో బీసీ ఈక్వేషన్తో పాటు రజనీ భర్త కుమారస్వామి నాయుడు కాపు కావడంతో అలా టీడీపీకి చెక్ పెట్టి ఈ సీటు వైసీపీ ఖాతాలో వేసుకోవాలన్నదే జగన్ ప్లాన్. దీనికి తోడు రజనీపై అధిష్టానం పెద్దలకు ఉన్న అపారమైన ప్రేమతోనే ఆమెను ఎలాగైనా అసెంబ్లీలో ఉంచాలనే ఆమెకు వెస్ట్ సీటు ఇచ్చారంటున్నారు.
మామూలుగా వెస్ట్ సీటు టీడీపీకి కంచుకోట. పార్టీ గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైనా కూడా వెస్ట్ సీటును టీడీపీ ఏకంగా 12 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఆ తర్వాత ఇక్కడ గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాల గిరి వైసీపీ చెంత చేరిపోయారు. ఇక ఇప్పుడు రజనీపై పోటీకి పలువురు పార్టీ నేతల పేర్లు పరిశీలించిన చంద్రబాబు ఇప్పుడు సరికొత్త ఈక్వేషన్తో ఆమెకు చెక్ పెట్టేందుకు ప్లానింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రజనీ మహిళ కావడంతో ఇప్పుడు చంద్రబాబు కూడా మహిళా ఈక్వేషన్తోనే ఆమెకు చెక్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారట. విజయవంతమైన ఓ మహిళా పారిశ్రామికవేత్తను రజనీపై పోటీకి దిగాలని… రెడీగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు గత కొంత కాలంగా డెయిరీ వ్యాపారంలో సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోన్న శ్రీ సురభి మిల్క్ చైర్ పర్సన్ వీఆర్ లక్ష్మీ శ్యామలను గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ బరిలోకి దింపుతోందట. ఆమె ఉమ్మడి గుంటూరుతో పాటు కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా పలు వ్యాపారాలు సేవా కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.
ఇప్పటికే టీడీపీ పెద్దలు లక్ష్మీ శ్యామలతో చర్చలు జరిపారని.. రజనీపై పోటీ చేసేందుకు ఆమె కూడా ఓకే చెప్పారని.. త్వరలోనే ఆమె పేరు టీడీపీ తరపున గుంటూరు వెస్ట్ సమన్వయకర్తగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఏదేమైనా రజనీపై మహిళా అస్త్రంతోనే టీడీపీ రెడీ అవుతోంది.