అమరావతి: ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న తరహా పరిశ్రమలకు గుడ్ న్యూస్ అందించారు. పరిశ్రమలకు సంబందించి ప్రభుత్వం వద్ద నుండి రావాల్సిన పాత బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవడంతో పాటు కరోనా లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులను మాఫీ చేయనున్నట్లు సీ ఎం జగన్ ప్రకటించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)ల బలోపేతం కోసం ‘రీస్టార్ట్’ పేరిట ఓ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించారు. దీనిలో భాగంగా రెండు విడతలుగా రూ.1110 కోట్ల మేర సాయాన్ని ప్రకటించారు.
చిన్న పరిశ్రమలకు ప్రభుత్యం నుండి చేయూత నందిస్తామని హామీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో చిన్న,మధ్య తరగతి పరిశ్రమల ప్రతినిధులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పరిశ్రమల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆన్నారు. గత ప్రభుత్వ హయాంలోని బకాయిలను కూడా చెల్లిస్తున్నామనీ, లాక్డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూతపడి నష్టాల్లో ఉండటంతో విద్యుత్ ఛార్జీ లను మూడు నెలల పాటు మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోనే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యం గల కార్మికులు అవసరమో గుర్తించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.827 కోట్లతో పాటు మొత్తం రూ.905 కోట్ల ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా రూ.187 కోట్ల స్థిర విద్యుత్ చార్జీల మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నిర్వహణ మూల ధనం రుణాలకు రూ.200 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు కేవలం 6 నుంచి 8 శాతం వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోళ్లలో 25 శాతం ఎమ్ఎస్ఎమ్ఈల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించామన్నారు.
అలా చేసిన కొనుగోళ్లకు 45 రోజుల్లో చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.