రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పనితీరు ఏపీ సీఎం జగన్ కు విపరీతంగా నచ్చినట్టుంది. అందుకే ఆమెను విశ్రాంతి తీసుకోనివ్వకుండా ప్రభుత్వ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. పైగా.. పదవీ విరమణ చేయనివ్వడం లేదు. ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నారు. గతంలోనే కేంద్రానికి లేఖ రాసి ఆమె పదవీ కాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం మరోసారి కేంద్రానికి ఆమె పదవీ కాలం పొడిగించాలని లేఖ రాశారు. దీని వెనుక కారణాల గురించి పెద్దగా చర్చలు అవసరం లేదనే చెప్పాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆమె పనితీరు, రాబోయే రోజుల్లో జగన్ చేపట్టబోయే ప్రాజెక్టులు, అనేక కార్యక్రమాలకు ఆమె అయితే సరైన న్యాయం చేస్తారని భావించి జగన్ ఈ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.
వివాదరహితంగా సున్నితంగా..
నీలం సాహ్నీ తన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు. నిజానికి జగన్ వద్ద పని చేయడం కష్టం అంటున్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా పని చేయాల్సిందే. ఆయన ఆదేశించిన ప్రకారం జీవో రావాల్సిందే. చట్టంతోనూ, బేధాభిప్రాయంతోనూ, నేతల సమర్ధతతోనూ జగన్ కు పనిలేదు. ఆయన అనుకున్నదే జీవో రావాలి. చట్టంగా రావాలి. అందుకే సాక్షాత్తూ నీలం సాహ్ని కోర్టు ధిక్కారణ కేసులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ భవనాలకు రంగులు, ఆంగ్ల మాధ్యమం.. వంటి కేసుల్లో ఆమె కోర్టు మెట్లు ఎక్కారు. అయినా కానీ.. సీఎం తీరుపై ఆమెకు అసంతృప్తి లేదు.. ఆమె పనితీరుపై జగన్ కు అసంతృప్తి లేదు. ఈ కారణంగానే ఆమె పదవీ కాలం పొడిగిస్తూ వచ్చారు. నిజానికి.. ఆమె జూన్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది.
కానీ.. జగన్ కేంద్రానికి లేఖ రాయడంతో ఆమెకు మూడు నెలల పదవీ కాలం పొడిగించింది. తాజాగా మరోసారి జగన్ కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. కేంద్రం అనుమతిస్తే ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకూ ఇదే హోదాలో కొనసాగుతారు. సున్నితంగా ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించుకోవడం.. సీఎం పేషీలోని అధికారులతో సమన్వయం చేసుకోవడం.. సీఎం ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడం ఆమెకు కలిసొస్తున్న అంశాలుగా చెప్పాలి.