(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఏపి సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వైసీపీ పార్లమెంట్ సభ్యులకు సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలపై నేడు ఎంపిలతో ఏర్పాటు చేసిన వర్చువల్ మీటింగ్లో సిఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలని సూచించారు.
ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టి బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు తదితర అంశాల అజెండాగా సమావేశం సాగింది. అవకాశం ఉన్న అన్ని ఫార్మాట్లను పార్లమెంట్లో వినియోగించుకోవాలని సభ్యులకు జగన్ సూచించారు.
తొలుత జరిగిన బిఏసి సమావేశంలో వైసిపి లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి కరోనా నియంత్రణ చర్యలు, రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టి బకాయిలు తదితర అంశాలను చర్చించాలని స్పీకర్ ఓంబిల్లాను కోరారు.
కాగా ఈ వర్చువల్ మీటింగ్లో పాల్గొనాలని తొలుత వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజుకు ఎస్ఎంఎస్ సందేశం వెళ్ళింది. ఆ తరువాత ఆయనను రావద్దని వైసీపీ ఎంపిలు సమాచారం ఇచ్చారు. దీంతో తాను ఏ పార్టీయో చెప్పాలంటూ నిలదీస్తున్నారు రఘురామకృష్ణం రాజు.