భారత్ చైనా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కి దేశమంతా ఘన నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. స్వయంగా సీఎం కేసీఆర్ అతని ఇంటికి వెళ్ళి అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి పరామర్శించి వచ్చారు.
అయితే ఇప్పుడు కల్నల్ సంతోష్ బాబు విగ్రహం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. అతని మరణానికి గౌరవార్థం ఆయన స్వస్థలం సూర్యాపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి ఇందులో భాగంగా ఈ విగ్రహం యుద్ధప్రాతిపదికన తయారవుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శిల్పులు తయారుచేస్తున్న ఈ విగ్రహం యొక్క నిర్మాణం పూర్తి కాగా ఇప్పుడు దానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. సూర్యాపేట పాత బస్టాండ్ జంక్షన్ లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ నెల 15న తూర్పు లఢక్ వద్ద గల గల్వాన్ లోయలో భారత సైనికులు-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సంతోష్బాబుతో పాటు మరో 19 మంది సైనికులు వీర మరణం పొందారు. సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంది. కల్నల్ భార్యకు గ్రూపు-1 ఉద్యోగంతో పాటు బంజారాహిల్స్లో ఇంటి స్థలం, రూ.5 కోట్ల నగదు అందించిన సంగతి తెలిసిందే. సీఎం స్వయంగా వారి ఇంటికి వెళ్లి వీటిని అందించారు.