సాధారణంగా వాస్తవాలను దాచిపెట్టాలనో లేక వారి పాలనలో రాష్ట్ర ఖజానాలో డబ్బే డబ్బు అనే ఫీలింగ్ ఇవ్వాలనో తెలియదు కానీ… బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో ప్రతీ ప్రభుత్వమూ నేల విడిచి సాము చేసేలా వ్యవహరిస్తాయని విమర్శలు వస్తుంటాయి. అయితే పాలనలో మిగిలిన అన్ని విషయాల్లోనూ తన మార్కు చూపిస్తున్న జగన్… ఈ విషయానికి వచ్చేసరికి ఆనవాయితీగా వస్తోన్న అంకెల గారడీని వీడలేకపోయారని అంటున్నారు ఆర్థిక నిపుణులు! సామాన్యులకు ఏపీ బడ్జెట్ లో చూపించిన అంకెలు ఆనందాన్ని కలిగించడంతోపాటు, భవిష్యత్తుపై భరోసాని కల్పించేవిగా ఉన్నప్పటికీ… వాస్తవాలు మరిచి నేలవిడిచి సాముచేసేలా ఉంది తాజా బడ్జెట్ అని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్ కాలానికే కఠిన పరీక్ష పెడుతోన్న సమయంలో.. దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై రీవ్ర ప్రభావం చూపిస్తున్న తరుణంలో.. ఇక ఏపీ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!! అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో… కరోనా ప్రభావం కనిపించలేదని, ఆ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదనే కామెంట్లు పడుతున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉనాయని, కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక రంగం ఎదురీదాల్సిన పరిస్థితిని తెలియజేసే వాస్తవాలను జగన్ సర్కార్ దాచిందని అంటున్నారు.
రాష్ట్రప్రభుత్వాలు చాలా వరకూ సంక్షేమ పథకాలనే ప్రధాన రాజకీయ అస్త్రాలుగా వినియోగించుకుంటున్న రోజులివి. జనాలు కూడా వాటిపైనే అధిక ఆసక్తి చూపిస్తున్నారు! ఎన్నికల వాగ్ధానాలలో కూడా సంక్షేమ పథకాలదే కీలక పాత్ర కాగా… ఒక టెర్మ్ పాలన అనంతరం కూడా ఆ సంక్షేమ పథకాల అమలే కీలకం!! ఈ క్రమంలో బడ్జెట్ లో ఖర్చు పెట్టే నిధుల్లో సగానికి పైగా సంక్షేమ పథకాలపైనే వెచ్చిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులో రెండు రకాలు ఉంటాయి! అర్హులకు పథకాలను ఇవ్వడం ద్వారా చేయూతనివ్వడం ఒకటైతే… ఉచితాలను అనుచితంగా ఇచ్చే ప్రక్రియ మరో రకం! వీటిలో మొదటిదాన్ని ఎవరూ ఆపేక్షించరు… రెండో దాన్ని ఎవరూ సమర్ధించరు అన్న విషయం ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చు.. దానికోసం అప్పులు చేయొచ్చు… కానీ ఎల్లకాలం అప్పులతోనే కాలం వెళ్లదీయం సాధ్యం కాని పని. దానికి కారణం… చెల్లించే సామర్థ్యం లేని పక్షంలో అప్పుకూడ పుట్టదు! కాబట్టి… ప్రభుత్వాలు ఇప్పటికైనా జాగ్రత్త పడి, బడ్జెట్ లో అంకెలకంటే వాస్తవాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్న్ చేసుకోవాలని… సమస్యలను జనాలకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నాలు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!