ఏపీలో జరిగాయని చెబుతున్న కరోనా పరీక్షల గణాంకాలన్నీ ఫేక్ అంటూ తెలుగుదేశం పార్టీ కొత్త ఆరోపణ చేసింది.
అసలు శాంపిల్స్ తీసుకోకుండానే పరీక్షల రిపోర్టుల పేరుతో సంబంధితులకు మెసేజీలు పంపుతున్నారని టిడిపి బయటపెట్టింది.ఇదో ఎస్సెమ్మెస్ టెస్టింగ్ కుంభకోణమని సాక్షాత్తు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.రాష్ట్రంలో పది లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న జగన్ ప్రభుత్వ ప్రకటన బూటకం అంటూ ఆయన అనంతపురం జిల్లాలో జరిగిన ఒక సంఘటనను ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.
ఆ జిల్లాలోని తాడిపత్రిలో ఏడుగురు సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించకుండానే వారికి నెగటివ్ అంటూ మెసేజ్లు పంపడాన్ని చంద్రబాబు వీడియో రూపంలో విడుదల చేశారు.తాడిపత్రిలో పదహారవ వార్డ్ సెక్రెటరీగా పనిచేస్తున్న సుశీల అనే ఉద్యోగి ఈ విషయాన్ని అంగీకరించింది.తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి అధికారి పూర్ణ శంకర్ తనకు ఫోను చేసి సచివాలయ పరిధిలోనే కొందరిని కరోనా పరీక్షలకు పంపాలని కోరగా తానుఎవరో ఎందుకులే అని తన సచివాలయ ఉద్యోగులనే ఏడుగురిని పంపానన్నారు.వారంతా ప్రభుత్వాస్పత్రికి పరీక్షలకు వెళ్లారని అయితే ఎవరూ శాంపిల్స్ కూడా తీసుకోకపోవడంతో తిరిగొచ్చేశారు అన్నారు.తాను ఈ విషయం పూర్ణ శంకర్ దృష్టికి తీసుకురాగా మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చేస్తాములెండి ..ఇప్పుడు కుదరలేదని అని సమాధానమిచ్చారని సుశీల చెప్పారు.అయితే ఆ కాసేపటికి తాను పంపిన ఏడుగురికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు నెగటివ్ అని తేలినట్లు ఎస్సెమ్మెస్ మెసేజులు వచ్చాయని దీంతో తామంతా ఆశ్చర్యపోయామని తెలిపారు.మళ్లీ ఈ విషయమై ఫోన్ చేస్తే అదంతే లెండి అని
పూర్ణ శంకర్ జవాబిచ్చాడని సుశీల మధ్యే చెప్పారు.తాను శాంపిల్ ఇవ్వకుండానే తనకు నెగటివ్ అని ఎస్సెమ్మెస్ వచ్చిందని మరో సచివాలయ ఉద్యోగి తేజ ధ్రువీకరించాడు
ఇవన్నీ చంద్రబాబు నాయుడు తన ఫేస్ బుక్కులో పెట్టిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.వినిపిస్తున్నాయి.ఈ కరోనా పరీక్షల లెక్కల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.మరి జగన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.