సంచలనాలు సృష్టించిన సంఘటనలపై డిజిపి స్థాయి అధికారి చేసిన వ్యాఖ్యలు ఒక్కోసారి తీవ్ర విమర్శలకు దారి తీస్తుంటాయి.
గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జగన్ పై విశాఖపట్నం ఎయిర్పోర్టులో దాడి జరిగిన గంటలోపే అప్పటి డిజిపి దాన్ని చాలా తేలిగ్గా తీసుకుని ఇది కోడి కత్తి దాడి ..ఆయన పార్టీవారే చేశారంటూ వ్యాఖ్యానించారు.చివరకు అదెంతో దోబారా రేపిందో అందరికీ తెలుసు.ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేసి విమర్శలు కొని తెచ్చుకున్నారు.ఈ మధ్యకాలంలో రధాలు దగ్ధమయ్యాయి దేవాలయాల్లో విగ్రహాలు మాయమయ్యాయి ఇంకా అనేకానేక సంఘటనలు జరిగాయి.వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు రెచ్చిపోయాయి.
ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ మతి స్థిమితం లేని వ్యక్తిబ రధాన్ని దగ్ధం చేశాడని.. పిల్లలు లేరన్న కారణంతో మరో వ్యక్తి మూఢ భక్తితో విగ్రహాన్ని ధ్వంసం చేసి విగ్రహంలో కొంత భాగాన్ని ఇంటికి తీసుకెళ్ళి పూజలు చేశాడని వివరణ ఇచ్చారు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన సున్నిత అంశంలో డీజీపీ వివరణ ఏ మాత్రం సమర్థనీయంగా లేకపోవడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఒక ఘటన జరిగితే అనుకోకుండా జరిగినదని సరిపెట్టుకోవచ్చు. కానీ, బిట్రగుంటలో ఓ రధం తగలబడింది.. ‘ఆకతాయి’ పని అనేశారు. అంతర్వేదిలో ఇంకో రధం తగలబడింది..
ఈసారి ‘తేనె పట్టు’ కథ చెప్పారు. పిఠాపురంలో దేవతా మూర్తుల విగ్రహాలు తగలబడ్డాయి.. ఆకతాయి పని అని సెలవిచ్చారు. ఇంకో చోట ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసమైతే, ‘బొమ్మే కదా.. దేవుడికి వచ్చిన నష్టమేంటి.?’ అని ఓ మంత్రిగారు చెప్పుకొచ్చారు.ఒక డీజీపీ యే కాదు వైసీపీ మంత్రులు ముఖ్య నేతలు కూడా ఆలయాలకు సంబంధించిన అంశాలలో ఏమాత్రం నమ్మశక్యం గాని కహానీలు వినిపిస్తున్నారు.ఒకటి మాత్రం నిజం.ఉన్నట్లుండి ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఎక్కడో ఒకటి జరుగుతోందంటే ఏపీలో ఏదో కుట్ర జరుగుతోందని భావించాల్సి ఉంటుంది.ఆ కుట్రను పోలీసులు ఛేదించాలి.అప్పుడే ప్రజలు భేష్ అంటారు తప్పితే ఇలాంటి చందమామ కథలు చెప్తే మాత్రం వారి దృష్టిలో పోలీసులు పలచనవుతారు.