గతకొన్ని రోజులుగా సాయిరెడ్డికి – జగన్ కు మధ్య ఏదో జరుగుతుందని.. జగన్, విజయసాయిరెడ్డిని విడతలవారీగా దూరంగా పెడుతున్నారని కథనాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నాయి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో విశాఖకు వెళ్లిన జగన్… సాయిరెడ్డిని కారులోనుంచి దింపేశారు.. అన్న వార్తలు రావడంతో మొదలయ్యాయి ఈ కథనాలు! అనంతరం సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చినా ఇవి ఆగలేదు సరికదా కొత్త రూపు సంతరించుకున్నాయి! ఈ క్రమంలో అలాంటిదో లేక నిజంగా జరగబోయేదో తెలియదు కానీ… ఒక కొత్త కథనం ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయ వర్గాల చుట్టూ తిరుగుతుంది!
ఇప్పటికే పార్టీకి సంబంధించిన అధికారాలు కత్తిరించడంలో భాగంగా విజయసాయి రెడ్డి స్థానంలో… తాడేపల్లి ఆఫీస్ బాధ్యతలు మొత్తం సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇచ్చారనేది ఒక మాట కాగా… విజయసాయి రెడ్డిని కేవలం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారన్నది మరొక మాట! కారణాలు ఏమిటన్నది కాసేపు పక్కనపెడితే… అవి వాస్తవాలు!! అయితే ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న విజయసాయి రెడ్డికి.. ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేస్తున్నారు. అంటే… ఏపీకి సంబందించి అధికారపార్టీ పెద్దలు, నేతలు ఎవరు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలవాలన్నా.. అది సాయిరెడ్డి నేతృత్వంలోనే జరిగేదన్నమాట! అందులో భాగంగా ఆయనకు కేబినెట్ హోదా కూడా వచ్చింది!
ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ వెళ్లిన బుగ్గన రాజేంద్ర నాథ్… కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి.. వినతి పత్రం సమర్పించి.. అనంతరం రాష్ట్రానికి రావాల్సిన వివిధ నిధులపై చర్చించారు. అయితే… ఆ సమయంలో బుగ్గన వెంట ఉన్నది సాయిరెడ్డి కాదు… రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం! దాంతో… ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయసాయి రెడ్డిని తప్పించి.. ఆ బాధ్యతలు అజయ్ కల్లంకు అప్పగించబోతున్నారంటూ కథనాలు మొదలైపోయాయి! పైన చెప్పుకున్నట్లుగానే… ఇది కూడా ముందు కథనంగా మొదలై తర్వాత వార్తగా మారే సూచనలు లేకపోలేదు అనేది పలువురి అభిప్రాయంగా ఉంది! అదే జరిగితే… సాయిరెడ్డికి ఢిల్లీ లెవెల్ షాక్ తగిలినట్లే అనేది విశ్లేషకుల మాటగా ఉంది!! ఇక్కడ మరో విషయం ఏమిటంటే… ఆ పదవి పోతే, దానితో పాటు సాయిరెడ్డికి కేబినెట్ హోదా కూడా పోతుంది!!