ప్రపంచం ఇంకా కరోనా వైరస్ నుంచి కొంచెం కూడా కోలుకోలేదు. అది చేసిన బీభత్సం ఎన్నటికీ పూరించలేనిది. అంతలోనే కొన్ని చోట్ల మరికొన్ని వైరస్ లు పుట్టుకొచ్చి జనాన్ని ఆగం చేస్తున్నాయి. కరోనా భయమే పోలేదు అంటే మరో వైరస్ ఏంటని ఆగం అవుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అని ఆలోచిస్తున్నారు.
ఈ వైరస్ మన దగ్గర కాదు లేండి. డెన్మార్క్ దేశంలో ఈ కొత్త బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. దాంతో అక్కడివారంతా భయపడుతున్నారు. జట్లాండ్లోని ట్రస్ట్ రప్ దగ్గర్లోని రాండర్సు పట్టణంలో దీనికి సంబంధించిన పరీక్షలు జరిగాయి. అక్కడున్నకోళ్లలో హెచ్5 ఎన్8 బర్డ్ ఫ్లూ సోకిందని సీరం ఇన్స్టిట్యూట్ జరిపిన పరీక్షల్లో తేలింది. దాంతో డెన్మార్కు దేశంలో బర్డ్ ఫ్లూ సోకకుండా నివారించేందుకు 25వేల కోళ్లను చంపాలని నిర్ణయించారు.
దీనిపై ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వశాఖ, పశుసంవర్ధక, ఆహార శాఖ ఇప్పటికే ఆదేశాలను జారీ చేసింది.ఈ విషయాలను వెటర్నరీ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రెస్ కు తెలిపింది. ఈ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న ఆ ప్రాంతాల్లోని పౌల్ట్రీలను పరీక్షించేందుకు 10 కిలోమీటర్ల దూరంతో 2 రిస్ట్రిక్షన్ జోన్లను ప్రారంభించారు. 10కిలోమీటర్ల దూరంలో ఆ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఉంచి ఫ్లూను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఈ నెల మొదట్లో జట్లాండ్ లోని అడవి పక్షుల్లో ఈ బర్డ్ ఫ్లూను కనుగొన్నారు. బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో సహా ఐరోపాలోని పలు ప్రాంతాలకు కూడా విస్తరించిందని సమాచారం. అలాగే బాస్టియాకు సమీపంలోనున్న ఒక పార్క్ లో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసు బయటపడిందని ఫ్రెంచ్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కానీ ఈ ప్లూ ఇంతవరకు ఏ ఒక్క మనిషికి కూడా సోకినట్లు నిర్ధారణ కాలేదు.