ఎందుకో తెలియదు గాని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటే ఇటీవల చంద్రబాబు, లోకేష్ కు పెద్దగా నచ్చటం లేదు. గంటా తెలుగుదేశం పార్టీని వీడి పలు పార్టీలు మారి 2014లో తిరిగి టిడిపిలోకి వచ్చారు. అప్పుడు చంద్రబాబు ఆయనకు మంచి ప్రయారిటీ ఇచ్చారు. ఐదేళ్లపాటు మంత్రి పదవి అనుభవించారు.. ఎప్పుడు అయితే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో అప్పటి నుంచి గంటా టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా గోడమీద పిల్లివాటం ప్రదర్శిస్తూ వచ్చారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అస్సలు పట్టించుకోలేదు అన్న విమర్శలు ఉన్నాయి.
అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జగన్ సర్కారుపై అలుపెరగని పోరాటం చేశారు. ఆయనతోపాటు ఆయన తనయుడు విజయ్ ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. అరెస్టయ్యారు.. జైలుకు వెళ్లి వచ్చారు.. గంటా మాత్రం చాలా సైలెంట్ గా ఉంటూ పార్టీ కార్యక్రమాలు అస్సలు పట్టించుకోలేదు. చివరకు చంద్రబాబు అరెస్టు అయినప్పుడు మాత్రమే నామ్కే వాస్తేగా స్పందించారు. ఇవన్నీ చంద్రబాబుతో పాటు లోకేష్ గమనిస్తూ వచ్చారు. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఈ ఎన్నికలలో భీమిలి లేదా చోడవరం, అనకాపల్లిలో ఎక్కడ ఒక చోట నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.
గంటా అంటేనే ప్రతి ఎన్నికకు నియోజకవర్గ మారుతూ వస్తూ ఉంటారు. అయితే ఈసారి గంటాను ఏకంగా విశాఖ జిల్లా నుంచి పొరుగు జిల్లాకు మార్చేయాలని టిడిపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన కూడా స్వయంగా ప్రెస్మీట్లో చెప్పారు. విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న చీపురుపల్లి నుంచి గంటాను పోటీ చేయించాలన్నదే చంద్రబాబు, లోకేష్ ఆలోచనగా తెలుస్తోంది. విశాఖ రాజకీయాల నుంచి గంటాను తప్పించాలని లోకేష్, అయ్యన్నపాత్రుడు బలంగా డిసైడ్ అయ్యారని వారిద్దరూ తెరవ వెనక చేసిన వ్యూహం మేరకే గంటాను చీపురుపల్లి బరిలోకి దింపాలన్న ప్రతిపాదన తెలుగుదేశం పార్టీ గంటా ముందు పెట్టిందని తెలుస్తోంది.
అయితే గంటా మాత్రం విశాఖ జిల్లా నుంచి విజయనగరం జిల్లాలోని చీపురుపల్లికి వలస వెళ్లేందుకు అస్సలు ఒప్పుకోవటం లేదు. మరీ ముఖ్యంగా లోకేష్ కు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గంటా వ్యవహార శైలి నచ్చలేదని అందుకే గంటాకు వ్యూహాత్మకంగా చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తనను చీపురుపల్లి వెళ్ళమని టిడిపి అధిష్టానం చెప్పడంతో గంటా సైతం లోలోన రగిలిపోతున్నారు. అందుకే ఆయన నేరుగా ప్రెస్ మీట్ పెట్టి తాను చీపురుపల్లికి వెళ్లనని తేల్చి చెప్పారు. విచిత్రం ఏంటంటే తన పొలిటికల్ కెరీర్లో అయ్యన్న మొత్తం మూడుసార్లు ఓడిపోయారు. అసలు ఓటమి అంటే తెలియని గంటాని పక్కన పెట్టి అయ్యన్నకు ప్రాధాన్యత ఇస్తుండడంతోనే గంటా విషయంలో టిడిపి వైఖరి ఎలా ?ఉండబోతుందో చెప్పకనే చెప్పినట్లు అయింది.