అమరావతి: రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కౌంటింగ్కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 36 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు.
మొత్తం 25,224 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని డిజిపి ఆర్పి ఠాకూర్ చెప్పారు. 3325 మంది (35 కంపెనీలు) సిఎపిఎఫ్, 5490 మంది (61 కంపెనీలు) ఎపిఎస్పి, 16409 మంది జిల్లా బలగాలను వినియోగిస్తున్నామని ఠాకూర్ తెలిపారు.
మూడంచెల భద్రతలో మొదటి వలయంలో సిఎపిఎఫ్ భద్రత, రెండో వలయంలో ఎపిఎస్పి భద్రత ఉంటాయనీ, లోపలిదయిన మూడో వలయంలో భద్రతను జిల్లా పోలీసుల చూస్తారనీ ఆయన వెల్లడించారు.
పోలీసుల అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిషేధమని ఠాకూర్ తెలియజేశారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లో ఉంటాయని ఠాకూర్ పేర్కొన్నారు.
శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు కౌంటింగ్ కేంద్రాలున్న పట్టణాల్లో పికెట్లు ఏర్పాటు చేశామని ఠాకూర్ చెప్పారు.
నేర చరిత్ర ఉన్న వ్యక్తులను కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతించడం లేదని ఠాకూర్ తెలిపారు.
కౌంటిగ్ కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు 1200 బాడీ వార్న్ కెమెరాలు, ఐదుఫాల్కన్ వాహనాలు, 14770 సిసి కెమెరాలు, 68 డ్రోన్లు, 9వేల సమాచార పరికరాలు వినియోగిస్తున్నామని ఠాకూర్ చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని ఆర్పి ఠాకూర్ తెలియజేశారు.