Electric Vehicles: దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. సాధ్యమైనంత మేర పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకాన్ని తగ్గించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకోసమే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు సబ్సిడీ, ప్రోత్సాహకాలు అందిస్తోంది. అంతేకాకుండా భవిష్యత్ మొత్తం ఈవీ మీద ఆధారపడుతుందనే సంకేతాలు ఇస్తున్నది కేంద్రం… ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వాడేలా చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాకాలు మొదలెట్టింది. అయితే, ప్రస్తుతం ఈవీ చార్జింగ్ కేంద్రాలు తక్కువగా ఉండటం వలన చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు వెనుకాముందు అవుతున్నారు. తాజాగా ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. ఏపీ కొత్త పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ నెడ్క్యాప్ (NREDCAP) చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
Electric Vehicles: నెడ్ క్యాప్ కీలక నిర్ణయం..
ఇందుకోసం తాజాగా ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం టైరెక్స్, స్టాటిక్ అనే సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి లోపు ఈ రెండు సంస్థలు సంయుక్తంగా కనీసం 100 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాయి. నెడ్క్యాప్ కంపెనీ ప్రధాన పట్టాణాల్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. లో బ్యాటరీ కెపాసిటీ గల టూవీలర్ ధర రూ.60వేలలోపే ఉంటోంది. చార్జింగ్ స్టేషన్లు పెంచితే ఈవీ వాహనాల వినియోగదారులు పెరుగుతారు. అందుకోసమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ఫాస్ట్ చార్జింగ్.. దేశవ్యాప్తంగా 22వేల స్టేషన్లు
కేంద్రం ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కల్పించేందుకు వేగంగా చర్యలు చేపట్టింది. గంటల తరబడి ఎలక్ట్రిక్ వెహికిల్స్కు చార్జ్ చేయాల్సిన పనిలేదు. అందుకేసమే కేంద్రం దేశవ్యాప్తంగా 22 వేల చార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందుకోసం వివిధ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతోంది కేంద్రం.. ముందుగా ప్రధాన పట్టణాల్లో 3 కిలోమీటర్ల లిమిట్స్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, రహదారులపై 25 కిలోమీటర్ల పరిధిలో చార్జింగ్ పాయింట్లను నెలకొల్పాలని ప్రణాళికలు చేసింది. ఈ విధంగా చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే ప్రజలు కూడా చార్జింగ్ వెహికిల్స్ తీసుకోవడానికి సిద్ధపడతారు.