YS Jagan: 156 లక్షల ఓట్లు 151 సీట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీకి ప్రజలు ఇచ్చిన కిరీటం ఇది. ఈ కిరీటాన్ని ఆయన నిలుబెట్టుకున్నారా ? లేదా, ఈ రెండున్నర సంవత్సరాలు ఎలా పరిపాలించారు?ఈ రెండున్నర సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి సాధించిన ప్రగతి ఏమిటి? అనేది అందరికీ తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి, పరిశ్రమలు (ప్రాజెక్టులు), ఉపాధి, ఈ నాలుగు అంశాలను సమానంగా ముందుకు తీసుకువెళితేనే మంచి పరిపాలన అందించినట్లు. కానీ ఏపిలో సంక్షేమం ఒక్కటే బాగుంది. అది కూడా అప్పులు తీసుకువచ్చి చేస్తున్న సంక్షేమం. మిగిలిన ముఖ్య అంశాలైన అభివృద్ధి, పరిశ్రమలు, ఉపాధికి జగన్ సర్కార్ ఇంత వరకూ పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. అయితే జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఇక ముందు రెండున్న సంవత్సరాల పాటు జగన్మోహనరెడ్డి ప్రణాళికలు ఎలా ఉండనున్నాయి. ప్రభుత్వంలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏమిటి. జగన్మోహనరెడ్డి తన పరిపాలనలో ఏ విధమైన మార్పులు చేసుకోబోతున్నారు. ముఖ్యంగా పార్టీ రియలైజ్ అయ్యందా? లేదా ఆయన రియలైజ్ అయ్యారా?. పార్టీలో మార్పులకు గానీ ప్రభుత్వంలో మార్పులకు గానీ వైసీపీలో జరుగుతున్న చర్చ ఏమిటి, జగన్మోహనరెడ్డి ఏమి చేయబోతున్నారు అనే వాటిపై విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ఏమిటంటే…
YS Jagan: ఈ రెండున్న సంవత్సరాల్లో అనేక మార్పులు?
జగన్మోహనరెడ్డి ఈ రెండున్న సంవత్సరాల్లో అనేక మార్పులు చేయబోతున్నారుట. వాటిలో ప్రధానంగా అయిదు అంశాలపై ఫోకస్ పెడుతున్నారనేది సమాచారం. వీటిలో మొదటిది పార్టీ ప్రక్షాళన. 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకూ జగన్మోహనరెడ్డి పార్టీ విషయాల గురించి అంతగా పట్టించుకోలేదు. పరిపాలనలో ఆయన నిమగ్నమై ఉన్నందున జిల్లాల వారీగా నాయకులే పార్టీ బాధ్యతలను చూసుకున్నారు. ప్రస్తుతం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అయిదుగురు ఇన్ చార్జిలు ఉన్నారు. అయోధ్య రామిరెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ఇన్ చార్జి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఈ ఇన్ చార్జిలను మార్చనున్నారుట. వీరిలో ముగ్గురికి పార్టీలో అంతర్గత (బ్యాగ్ రౌండ్ వర్క్) వ్యవహారాలు అంటే వచ్చే ఎన్నికలకు కసరత్తు చేయడానికి, మేనిఫెస్టో తయారీ, పరిపాలన విభాగాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ముగ్గురికి తెరవెనుక బాధ్యతలు అప్పగించి ఇద్దరికి మాత్రం ప్రభుత్వంలో భాగస్వామ్యులను చేయబోతున్నారు అనేది సమాచారం.
2. ప్రభుత్వ ప్రక్షాళన.. ప్రభుత్వ ప్రక్షాళన అంటే మంత్రులను మార్చడం. నిజానికి రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని సీఎం జగన్ ముందే చెప్పారు. ఆ గడువు వచ్చేసింది. డిసెంబర్ నెలలో క్రిస్మస్ తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని సమాచారం. అందులో భాగంగా ఇప్పటి వరకూ ఉన్న అందరు మంత్రులను మార్చాలన్నది ఒక ప్లాన్. లేదు ముగ్గురు, నలుగురు సీనియర్ మంత్రులను కొనసాగించి మిగతావాళ్లను మారిస్తే పార్టీలో అది పెద్ద ఇష్యూ అవుతుంది. మంత్రిపదవులు కోల్పోయిన వాళ్లు తాము ఏమి తప్పు చేశాము అని హర్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు పార్టీలో విభేదాలకు ఆస్కారం కలుగుతుంది. ఇటువంటి సమస్య రాకుండా ఉండాలంటే అందరినీ మార్పు చేస్తే ఎటువంటి ఇష్యూ కాదు. ఇది పార్టీ విధానపరమైన నిర్ణయమని అందరు సర్దుకుపోతారు. మరి అందరినీ మార్పు చేస్తే జగన్మోహనరెడ్డితో మొదటి నుండి అడుగులు వేస్తూ వచ్చిన సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, కురసాల కన్నబాబు, పేర్ని నాని వంటి వాళ్లను ఏమి చేయాలన్న దానిపై ఓ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. వాళ్లలో పది మంది సీనియర్లకు పార్టీ బాధ్యతలను అప్పగించనున్నారుట. అంతర్గత రాజకీయ వ్యవహారాల కమిటీ లేదా మరో పేరుతో ఏర్పాటు చేసే కమిటీలో వీళ్లంతా సభ్యులుగా ఉండనున్నారు. వీళ్లంతా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ఎమ్మెల్యేలకు సీఎం జగన్ అపాయింట్మెంట్లు ఇప్పించడం, నియోజకవర్గ పరిస్థితులపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ నిర్వహించడం ఈ కమిటీ ఉద్దేశంగా ఉండనున్నది.
3. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం. 2022 నాటికి ఎట్టిపరిస్థితుల్లోనూ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఇది ప్రభుత్వానికి అంత ఈజీ కాదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టమే. ప్రాజెక్టు భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకే సుమారు 29వేల కోట్లు కావాలి. కేంద్రం ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా విడుదల చేసే పరిస్థితి కనబడటం లేదు. పోలవరం పూర్తి చేయకపోతే జగన్మోహనరెడ్డి మాట తప్పినట్లు అవుతుంది. అందుకే ఈ ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలన్న దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది.
4. రాజధాని ఇష్యూను క్లీయర్ చేసుకోవడం. వచ్చే మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశంలో రాజధానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ కొత్త బిల్లును అసెంబ్లీలో, మండలిలో ఆమోదింపజేసుకుని ముందుకు వెళ్లాలనీ, వాటిలో ఏ విధమైన న్యాయపరమైన చిక్కలు రాకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది.
5. రాష్ట్రానికి ఓ పెద్ద పరిశ్రమ ఏదైనా తీసుకురావాలి. గత టీడీపీ ప్రభుత్వం వాళ్లు చెప్పుకోవడానికి కియా ఒకటి, రెడ్ మీ ఫోన్ల తయారీ యూనిట్ లతో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులు తీసుకువచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ రాలేదు. అందుకే ఈ రెండున్నరేళ్లలో ఫలితం చూపేలా ఓ పెద్ద పరిశ్రమ గానీ, ఓ ప్రాజెక్టు గానీ తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.