ఏలూరు ప్రజలను అంతుచిక్కని వ్యాధి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 21 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వింత వ్యాధికి కారణాలపై కమిటీ పరిశీలన జరిపి నివారణ చర్యలు కూడా సూచించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైపవర్ కమిటీ చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కన్వీనర్గా ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మరో 19 మంది సభ్యులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
600 దాటిన బాధితుల సంఖ్య
కాగా ఏలూరులో కొత్తగా మరో 13మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 609కి చేరింది. ఇప్పటి వరకూ 577 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. 32మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరి ఇప్పటి వరకూ ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు వేరే వ్యాది లక్షణాలతో మృతి చెందారని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధికి గల కారణాలపై ఇప్పటికే ఎయిమ్స్, సీసీఎంబీ తదితర సంస్థలకు చెందిన వైద్య నిపుణులు క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపారు. ప్రాధమికంగా బాధితుల రక్తంలో సీసం అధికంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించినా ఇతర పరీక్షల నివేదికలతో మరి కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో నిపుణుల నివేదికలు వచ్చిన తరువాతనే వ్యాధి గల కారణాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏలూరులో బాధితులను పరామర్శించడంతో పాటు ఎప్పటికప్పుడు విషయాలపై సమీక్ష జరుపుతున్నారు. దీనిపై పూర్తి స్థాయి నివేదికలు ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 21మందితో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.