తెలుగు రాష్ట్రాలతో సహా కర్నాటక రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఇప్పటికే సీఐడీ కేసులో అరెస్టు అయి బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యవస్థాపకులు అవ్వ వెంకట రామారావు, అవ్వ వెంకట శేషు నారాయణరావు, అవ్వ హేమసుందర వరప్రసాద్ను మంగళవారం రాత్రి హైదరాబాద్ లో అరెస్టు చేసి బుధవారం చంచల్గూడ జైలుకు తరలించిన ఈడీ అధికారులు.. తాజాగా ఈ సంస్థకు ఏపి, తెలంగాణ, కర్నాటక, ఒడిశాలో ఉన్న రూ.4109 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దాదాపు 48 ఎకరాల్లో గుంటూరు జిల్లాలో ఉన్న హాయ్లాండ్ ను సైతం ఈడీ అటాచ్ చేసింది.
అగ్రి గోల్డ్ యాజమాన్యం ఏపి, తెలంగాణతో పాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో 32 లక్షల ఖాతాలు, 19,18,865 మంది డిపాజిటర్ల నుండి సుమారు 6,380 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అత్యధికంగా ఏపిలోనే 11.58 లక్షల మంది డిపాజిటర్లు ఉండగా తెలంగాణలో 1.67 లక్షల మంది, కర్నాటకలో 4.81 లక్షల మంది డిపాజిట్లు చేశారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యం.. లక్షలాది మంది ఖాతాదారులను మోసం చేసిన కేసులో సీఐడీ దర్యాప్తు చేస్తుండగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. కేసు తదుపరి విచారణలో భాగంగా జుడీషియల్ రిమాండ్ లో ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్దమవుతున్నారు. అగ్రి గోల్డ్ యాజమాన్యం ఖాతాదారుల సొమ్మును వ్యక్తిగత ఖాతాలు, ఇతర వ్యాపారాల్లోకి మళ్లించడంతో పాటు విదేశాలలో పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా ఈడి అధికారులు గుర్తించారు.