Covid19: లక్నోలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కోవిడ్ పేషెంట్లు అందరిని కలవరపరుస్తోంది. షాశివేంద్ర పటేల్ అనే ఒక బయాలజీ టీచర్ డాక్టర్ లాగా మారి పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. అతని వల్ల ఒక నిండు ప్రాణం కూడా పోయింది.
వివరాల్లోకి వెళితే… పటేల్ కొద్దికాలంగా ‘స్మార్ట్ క్లినిక్’ అనే ఒక మెడికల్ రాకెట్ నడుపుతూ ఉన్నాడు. అతను జోనల్ మేనేజర్ గా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఈ ఫేక్ మెడికల్ ఫర్మ్ ని నడుపుతున్నాడు. కోవిడ్ రెండవ వేవ్ మొదలైనప్పుడు పటేల్ తాను ఒక డాక్టర్ ను అని.. ఒక ప్రముఖ హాస్పిటల్ తో తనకు సంబంధాలు ఉన్నాయని చెబుతూ పేషెంట్లకు ఇంటివద్దనే ట్రీట్మెంట్ ఇస్తూ ఉండేవాడు.
అంతేకాకుండా పేషెంట్ల ఇంటిలోనే తాత్కాలికంగా ఐసియు (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ను తనకున్న మెడికల్ పరిజ్ఞానంతో ఏర్పాటు చేసి లక్షలకు లక్షలు ఫీజు వసూలు చేసేవాడు. అయితే అతను మాత్రం అసలు డాక్టర్ లాగే తెల్ల కోటు ధరిస్తాడు కానీ పేషెంట్ ఇంటికి స్వయంగా వెళ్ళడు. అతని డ్రైవర్ ను వైద్యం కొరకు పంపిస్తాడు.
ఇక ఇదే క్రమంలో పీకే వశిష్ట అనే ఆవిడ భర్త ఇతను అందించిన కరోనా వైద్యం కారణంగా చనిపోయాడు. అయితే భర్త చనిపోయినప్పటికీ ఆమెను ఒకటిన్నర లక్షల రూపాయల ఫీజు కట్టాలని పటేల్ బలవంత పెట్టాడు. ఖర్చులన్నీ భరించక పోతే ఆమె దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు.
వెంటనే ఆమె పోలీసులకు ఈ సంగతి చెప్పడంతో ఈ ఫేక్ డాక్టర్ రాకెట్ మొత్తం బయట పడింది. సఫ్దర్గంజ్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి పిల్లలకు బయాలజీ టీచర్ అయిన పటేల్ తనకు ఉన్న సాధారణ పరిజ్ఞానంతో పల్స్ రేటు, రక్త పోటు, ఆక్సిజన్ శాచ్యురేషన్ అనే పదాలను వాడి ఇన్నిరోజులు ప్రజలను మోసం చేస్తూ వచ్చాడు. చివరికి అతని బండారం ఇలా బయటపడింది.