ఇది వాస్తవం. పైకి ఎన్ని చెప్పకొన్నా.. ఎన్ని మాటలు అనుకున్నా.. అంతర్గతంగా చూస్తే మాత్రం విజయ వాడ తూర్పులో టీడీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు సొంత సామాజిక వర్గం.. కమ్మల నుంచే వ్యతిరేకత కనిపిస్తోంది. వినిపిస్తోంది. `ఏం చేశారని గద్దెకు ఓటేయాలి` అనే టాక్.. స్థానిక ఆటోనగర్ లో మెజారిటీ భాగం కలిగి ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన లారీ ఓనర్ల అసోసియేషన్లు ప్రశ్నిస్తున్నాయి. పైకి చాలా గుంభనంగా ఉన్నాయి. కానీ, అంతర్గతంగా మాత్రం రగిలిపోతున్నారు.
ఒకప్పుడు.. విజయవాడ ఆటోనగర్ అంటేనే.. టీడీపీకి కంచుకోట. ఎక్కడికక్కడ టీడీపీ జెండాలు.. ఆ వర్గం సానుభూతి.. ఏకపక్షంగా నిర్ణయాలు.. వారే స్వయంగా పిలుపునివ్వడం కనిపించింది. ఇలానే.. 2009లో యలమంచిలి రవిని వారు ఎన్నుకొన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా.. లారీ ఓనర్ అసోసియేషన్లు, ఆటోనగర్ కార్మిక సంఘాలు సహా.. ఇతర వర్గాల్లోని మెజారిటీ కమ్మలంతా.. రవికి అప్పట్లో పట్టం కట్టారు. కానీ, ఆయన వీరి ఆకాంక్షలను ఏమాత్రం నెరవేర్చలేక పోయారు.
దీంతో ప్రజలు రవికి తిరుగుముఖం చూపించారు. ఇక, ఆ తర్వాత.. గద్దెను 2014లో గెలి పించారు. ఆయన గతంలో కొంత చేశారు. దీంతో 2019లో విజయం అందేలా చేశారు. పైగా.. గద్దెకు బలమై న ప్రత్యర్థి కూడా లేక పోవడంతో ఈ రెండు సార్లు విజయం దక్కించుకునేందుకు దోహద పడింది. కానీ, కాలం మారింది. ప్రత్యర్థి పక్షంలోనూ మార్పులు వచ్చాయి. బలమైన నాయకుడు, యువ నాయకుడు, ఫైర్ బ్రాండ్ నేత, బలమైన వారసత్వం నుంచి వచ్చిన నాయకుడు దేవినేని అవినాష్ బరిలోకి దిగాడు. అంతే.. విజయవాడ తూర్పు రాజకీయాలు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి.
ఇదొక్కటే కాదు.. గత నాలుగు సంవత్సరాలుగా దేవినేని అవినాష్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కొండలు గుట్టలు.. ఇలా ఏ ప్రాంతానికైనా తిరుగుతున్నారు. వైసీపీలోకి వచ్చినప్పటి నుంచి అవినాష్కు జగన్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంబంధం లేకుండా ప్రయార్టీ ఇస్తూ వచ్చారు. అడిగిన పని కాదనకుండా చేస్తూ వచ్చారు. అవినాష్ ఆటోనగర్ వాసుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. వీరి పనుల పరిష్కారం విషయంలో అవినాష్ చాలా ప్రయార్టీ ఇచ్చారు.
ఆటోనగర్ను అతి పెద్దగా విస్తరించడంతోపాటు.. అందమైన రహదారులు మౌలిక వసతులు కల్పించారు. ఇక, యువతకు ఆడుకునేందుకు ఆడిటోరియంల నిర్మాణం, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ ముందుకు రావడం వంటివి అవినాష్కు ప్లస్ అవుతున్నాయి. దీనికి తోడు గద్దె ప్రతిసారి కమ్మ బ్రాండ్ చెప్పుకుని వాళ్ల ఓట్లతో గద్దెనెక్కుతూ వస్తున్నారే తప్పా వారికి చేసిందేమి లేదన్న విమర్శలు బాగా ఎక్కువయ్యాయి. ఈ సమీకరణలు అన్నీ ఈ సారి అవినాష్కు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. దీనిని అందిపుచ్చుకుని అవినాష్ గెలుపు గుర్రం ఎక్కుతాడా ? అన్నదే చూడాలి.