ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు, ఉద్యోగ సంఘాలకు మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇటివల కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన జీతాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉద్యోగ సంఘాలు చేసిన ప్రకటనే ఇందుకు కారణం. కరోనా సమయంలో ప్రభుత్వం 50 శాతం జీతాలు మాత్రమే చెల్లించింది. మిగిలిన 50 శాతం జీతాలను 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ.. ప్రస్తుత సమయంలో ఇంత మొత్తం తమకు వద్దని.. ప్రభుత్వంపై భారం వేయదలచుకోలేదని ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని మరో పిటిషన్ వేస్తామని ఏపీ ఉద్యోగ సంఘం ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోందని తెలుస్తోంది.
ఉద్యోగ సంఘం తమ బాగోగులను చూస్తూ.. తమవైపు నిలబడాల్సింది పోయి ప్రభుత్వం తరపున నిలబడటమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేస్తూ తమ జీతాల్లో కోత విధించడమేంటనేది ఉద్యోగుల ప్రశ్న. ముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ప్రాముఖ్యతనిచ్చి తర్వాత ప్రజల సంక్షేమ పథకాల బాధ్యతలు చూడటం ప్రభుత్వ విధి అంటున్నారు. ఇప్పటివరకూ 4 డీఏలు, 2018 నుంచి పే రివిజిన్ రాలేదని.. దీనిపై మాట్లాడని నేతలు కోర్టు తీర్పుతో తమకు రావాల్సిన జీతాలను ఎందుకు పునఃసమీక్షించాలని కోరుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వోద్యోగుల సమస్యలపై సంఘాల నాయకుల వద్ద ప్రస్తావించలేని పరిస్థితులు నెలకొన్నాయని మరికొందరు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు తమకు వర్తించనప్పుడు ప్రభుత్వం నుంచి జీతాలు పూర్తిగా రావాల్సిందేనని అంటున్నారు. కొన్ని శాఖల ఉద్యోగులు పరిస్థితులను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన ప్రకటన సరికాదని ఉద్యోగులు అంటున్నారు.