Medaram Jatara: ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకూ మేడారం మహా జాతర జరగనుంది. జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న చాలా మంది ముందుగానే వెళ్లి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారంకు ఇప్పటి నుండి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాణీకుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
ఈ క్రమంలో సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ సదుపాయం మహాలక్ష్మి పథకం అమలులో ఉండగా, మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులకూ ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ పథకం అమలులో ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.
ఎండీ సజ్జనార్ తెలిపిన సమాచారం ప్రకారం..మేడారం జాతరకు టీఎస్ఆర్సీటీ 6వేల బస్సులను నడుపుతోంది. మేడారం జాతరకు 51 బేస్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుండి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో..ఈ జిల్లాల నుండి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
అలానే ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో హనుమకొండ జిల్లా కాజీపేట నుండి కూడా బస్సులను నడుపుతున్నారు. ఈ నెల 18 నుండి 25వరకూ ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఈ స్పెషల్ బస్సు సర్వీసుల్లోనూ ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించారు సజ్జనార్.
హైదరాబాద్ నుండి మేడారం వరకు మొత్తం 228 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదయం 6, 6.30 గంటలకు హైదరాబాద్ జేబీఎస్ నుండి, 7 గంటలకు ఎంజీబీఎస్ నుండి బస్సులు బయలుదేరతాయి. పెద్దలకు రూ.750లు, చిన్నారులకు రూ.450ల టిక్కెట్ ధర నిర్ణయించారు. మేడారం నుండి తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2, 2.30, 3 గంటలకు బయలు దేరతాయి.
ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిలలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఇందులో రానుపోను చార్జీ పెద్దలకు రూ.550లు, చిన్నారులకు 310లు నిర్ణయించారు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులను కూడా నడుపుతారు. అయితే వీటిలో ఉచిత ప్రయాణ సదుపాయం లేదు. సూపర్ లగ్జరీలో టికెట్ ధర పెద్దలకు రూ.750లు, చిన్నారులకు రూ.550లు, ఏసీ బస్సుల్లో పెద్దలకు రూ.950లు, పిల్లలకు రూ.750 లుగా నిర్ణయించారు.