ఉమ్మడి కడప జిల్లా అంటేనే పార్టీలకు అతీతంగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. అసలు 2004 ఎన్నికల నుంచి ప్రతి ఎన్నికకు ఇక్కడ టీడీపీ ఒక్క సీటు గెలుచుకోవడమే గగనమైంది. 2004లో కమలాపురం, 2009లో ప్రొద్దుటూరు, 2014లో రాజంపేట సీటుతో మాత్రమే సరిపెట్టుకుంది. 2019లో అసలు టీడీపీకి జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. వైసీపీ 10 అసెంబ్లీ, రాజంపేట, కడప పార్లమెంటు సీట్లను భారీ మెజార్టీలతో గెలుచుకుంది.
గత 20 ఏళ్లలో ముందు వైఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అయినా, ఆ తర్వాత జగన్ వచ్చాక వైసీపీ అయినా కడప జిల్లా పేరు చెపితేనే వైఎస్సార్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంటోంది. అలాంటి చోట 2024 ఎన్నికల్లో పరిస్థితులు కొంత వరకు మారతాయన్న చర్చలు బాగా వినిపిస్తున్నాయి. అధికార వైసీపీకి చెందిన నేతల నోటిలోనుంచే ఈ మాటలు బయటకు వస్తున్నాయి. ఈ సారి టీడీపీకి కడపలో ఖచ్చితంగా మూడు సీట్లు వస్తాయని కాదు కాదు.. 4-5 సీట్లు వస్తాయని మరి కొందరు చెపుతున్నారు.
ఇలా చెపుతోన్న వారిలో టీడీపీ, వైసీపీకి చెందిన నేతలు కూడా ఉంటున్నారు. దీనికి తోడు షర్మిలతో పాటు సునీత రెడ్డి ఇద్దరూ కడపలోనే పోటీ చేస్తే వైఎస్సార్ అభిమానుల్లో కొంత వరకు అయినా ఓట్లు చీలతాయంటున్నారు. ఈ లెక్కలు ఎలా ఉన్నా ఈ సారి రాజంపేట, రైల్వేకోడూరు, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు ఈ ఐదు సీట్లలో టీడీపీ ఖచ్చితంగా మూడు సీట్లు గెలుస్తుందన్న బెట్టింగ్ ఎక్కువుగా నడుస్తోంది.
టీడీపీ గెలిచే మూడు సీట్లలో పైన చెప్పుకున్న ఐదు సీట్లలో ఏవేని మూడు సీట్లు ఉంటాయని ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా భారీ ఎత్తున బెట్టింగులకు దిగుతున్నారు. ఇక దీంతో పాటు వైసీపీకి 100 సీట్లు రావని రూపాయికి రెండు రూపాయల వంతున బెట్టింగులకు దిగుతున్నారు. అలాగే వైసీపీకి 75 సీట్లు రావని రూపాయికి రూపాయి చొప్పున బెట్టింగులు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నడుస్తున్నాయి. ఏదేమైనా ఈ సారి కడప జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనంతగా టీడీపీ వాళ్లు బెట్టింగులకు కవ్విస్తున్నారు.