Hijab Row: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హిజాబ్ వివాదం సుప్రీం కోర్టు చెంతకు చేరింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హిజాబ్ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదనీ, స్కూల్ యూనిఫాం పై విద్యాసంస్థల నిబంధనలను విద్యార్ధులంతా తప్పనిసరిగా పాటించాల్సిందేనని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. దీనిపై కర్ణాటకలోని ఉడిపికి చెందిన ఆరుగురు ముస్లిం విద్యార్ధినులు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యాసంస్థల్లో సంప్రదాయ వస్త్రధారణపై కర్ణాటక ప్రభుత్వం విధించిన నిషేదాన్ని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం సమర్ధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది.
Hijab Row: కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ
విద్యాసంస్థల్లో హిజాబ్ వస్త్రధారణపై గత నెల కర్ణాటకలో పెద్ద ఎత్తున ఉద్రిక్తతల చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో హిజాబ్ కు మద్దతుగా, వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేసింది. ఈ నేపథ్యంలో హిజాబ్ వస్త్రధారణకు అనుమతి ఇవ్వాలంటూ పలువురు విద్యార్ధినులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తొలుత హైకోర్టులో సింగిల్ జడ్జి ధర్మాసనం కేసు విచారించి తరువాత విచారణను త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. పదిహేను రోజుల పాటు హైకోర్టులో వాదనలు జరిగాయి. గత నెల 25వ తేదీన విచారణ పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. తాజాగా మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.