మనలో చాలామందికి పావురాలు మరియు ఇతర పక్షులకు ఆహారంగా గింజలు వేయడం అలాగే వాటితో కొద్దిసేపు గడపడం వల్ల మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి పలు నగరాల్లో ఇటువంటివారు మనకి ఎక్కువగా తారసపడుతుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి కొంత కాలంపాటు మనం పక్షులకు దూరంగా ఉంటేనే మనకి మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. వారు ఆలా చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? ‘బర్డ్ఫ్లూ’. ఇప్పటికే బర్డ్ ఫ్లూ ఇండియా లోని చాలా రాష్ట్రాలకు సోకింది. సాధారణంగా పక్షులు ఒకచోట నుంచి మరొకచోటుకు వెళ్తుంటాయి కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ ఎక్కువగా పక్షుల వల్ల విస్తరిస్తుంది.
ఈ కారణం చేత పక్షి ప్రేమికులు కొంత కాలం పక్షులకు సన్నిహితంగా ఉండకుండా దూరంగా ఉండటమే ఉత్తమమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వాటితో సెల్ఫీలు తీసుకోవడం, వాటికి ఆహార ధాన్యాలు తినిపించడం కొంత కాలం చెయ్యవద్దని సూచిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు తెలంగాణలో బర్డ్ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు.
కానీ ముందుగా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్ మరియు నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో పావురాలు గుంపులుగా కనిపిస్తుంటాయి. పక్షిప్రేమికులు వాటితో సెల్ఫీలు తీసుకుంటూ, ఆహరం వేస్తూ కొంత సమయం గడుపుతూ ఉంటారు. ప్రస్తుతం భాగ్యనగరం చుట్టుపక్కల కొన్ని లక్షల పావురాల గుంపులు ఉన్నాయని చెప్పవచ్చు. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు బర్డ్ఫ్లూ భయం బాగా పట్టుకుంది.
ఈ భయం ఎంతలా ఉందంటే, తమ చుట్టుపక్కల ఎక్కడైనా పక్షి చనిపోయి కనిపిస్తే అది బర్డ్ ఫ్లూ వల్లనేమో అని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆ తరువాత అధికారులకు వెంటనే ఫోన్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కొన్ని రోజుల వరకు పక్షులు గుంపులుగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.