ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తీవ్ర తీవ్రతరం అవుతూనే ఉంది. ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణుల దాడి జరుగుతూనే ఉంది. దీంతో భారత విద్యార్ధుల భద్రతపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తొంది. భారత్ కు తిరిగి వెళ్లిపోవాలంటూ రీసెంట్ గా ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం హెచ్చరించింది. వెంటనే భారత్ కు వెళ్లిపోవాలంటూ విద్యార్ధులకు సూచించింది. అయితే రాయబార కార్యాలయం సూచనలను తిరస్కరిస్తున్నారు భారత వైద్య విద్యార్ధులు. యుద్దం ప్రారంభంలో ఇలాగే హెచ్చరించడంతో ప్రాణభయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో ఉరుకులు పరుగులతో భారత్ కు వెళ్లిపోయామన్నారు. భారత్ లో వైద్య విద్యను కొనసాగించేందుకు అవకాశం లేకపోవడంతో పాటు, పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయన్న సమాచారంలో యూనివర్శిటీలు సమాచారం ఇవ్వడంతో ఇటీవలే తిరిగి వచ్చామని చెబుతున్నారు.
ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఆకస్మిక రాకపోకల వల్ల డబ్బు చాలా ఖర్చు అవుతోందనీ, ఇది తమ కుటుంబాలకు పెను భారం అవుతుందని భారత వైద్య విద్యార్ధులు స్పష్టం చేస్తున్నారు. తమ వైద్య విద్యను పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం సాయం చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ చదువులు పూర్తి అయ్యే వరకూ ఉక్రెయిన్ లోనే ఉండటం మినహా తమకు ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు. ఆలోపు క్షిపణుల దాడిలో తాము మరణిస్తే తమ భౌతికకాయాలు భారత్ కు పంపాలని కోరుతున్నారు. ఉక్రెయిన్ లో భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్ధులు ఉన్నారు. వీరు అక్కడి మెడికల్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం ప్రారంభం అయిన తొలినాళ్లలో భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడంతో వీరు అందరూ భారత్ కు సురక్షితంగా చేరుకున్నారు. ఉక్రెయిన్ నుండి భారత్ కు వచ్చిన వైద్య విద్యార్ధులు ఇక్కడ వారి చదువు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించాలని వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. విద్యార్ధులు ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీల పిలుపుతో ఇటీవలే విద్యార్ధులు మళ్లీ ఉక్రెయిన్ కు వెళ్లారు. అయితే ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మరల తీవ్ర తరం అవుతుండటంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మరో పక్క ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చిన తమను దేశంలోని మెడికల్ కళాశాలలో చేర్చుకుని వైద్య విద్యను కొనసాగించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కొందరు విద్యార్ధులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నవంబర్ 1న విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు తీర్పు కోసం తాము ఎదురుచూస్తున్నామని ఉక్రెయిన్ లోని భారత వైద్య విద్యార్ధులు పేర్కొంటున్నారు.