ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం చెట్టినాడ్ గ్రూపు ఆఫ్ కంపెనీలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వంద బృందాలతో కలిసి హైదరాబాద్, చెన్నై, ముంబాయితో సహా మొత్తం 40 ప్రాంతాల్లో ఏకకాలంలో చెట్టినాడ్ సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.
చెట్టినాడ్ చైర్మన్ ముత్తయ్య నివాసంతో పాటు అతని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. చిట్టినాడ్ సంస్థలు పన్ను ఎగవేతకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. మరో రెండు మూడు రోజుల పాటు ఈ సంస్థల్లో సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు ఐటీ శాఖ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
2015లో ఒక పర్యాయం ఈ సంస్థల్లో ఐటీ దాడులు నిర్వహించి చెన్నైలోని సీబీఐ ఆఫీసులో చిట్టినాడు కంపెనీపై కేసు నమోదు చేసింది. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నది. చెట్టినాడు సంస్థకు వంద సంవత్సరాలకుపైగా చరిత్ర ఉంది. చెన్నై కేంద్రంగా పని చేస్తున్న చెట్టినాడు గ్రూపు పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది. నిర్మాణ రంగానికి సంబంధించి సిమెంట్, పవర్, స్టీల్ తదితర వ్యాపారాలను చేస్తోంది. దాదాపు 12వేల కోట్ల విలువైన కంపెనీలు, ఆస్తులు ఉన్నాయి. పలు వ్యాపారలతో పాటు ఈ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు కూడా ఉన్నాయి.