వాసవీ రియల్ ఎస్టేట్ గ్రూప్ పై ఐటి (ఆదాయ పన్ను శాఖ) సోదాలు నిర్వహిస్తొంది. ఐటి అధికారులు బృందాలుగా ఏకకాలంలో 20 ప్రదేశాల్లోని వాసవీ గ్రూప్ కార్యాలయాలు, సంబంధిత యాజమాన్య ప్రతినిధుల నివాసాలపై దాడులు చేశారు. వాసవీ గ్రూప్ లోని రియాలిటీ, నిర్మాణ్, ఇన్ ఫ్రా, శ్రీముఖ సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. వాసవీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిపైనా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ బంజరాహిల్స్ లోని వాసవీ గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతన్నాయి.
వాసవీ గ్రూపు చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ ల నివాసాల్లో, సంస్థ ప్రధాన కార్యాలయం, అనుబంధ కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సంస్థ తమకు వస్తున్న ఆదాయానికి ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఆదాయ పన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. వాస్తవ ఆదాయం చూపడం లేదన్న ఆరోపణలపై సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన విలువైన పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తొంది. వాసవీ గ్రూప్ ఏపి, తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తూ పెద్ద నిర్మాణ సంస్థగా ఉంది. ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి సమాాచారం రావాల్సి ఉంది.