ఏపీ అధికార పార్టీ వైసీపీలో తమకు అనుకూలంగా ఉన్న నేతలకు ఎమ్మెల్యేలు మద్దతునిస్తూ పార్టీ కోసం పనిచేసిన మిగిలిన నాయకులను విస్మరిస్తుండడంతో గ్రూపులు తయారవుతున్నాయి. గ్రూపులకి చెక్ చెప్పి నాయకులమద్య సయోధ్య కుదిర్చే నాథుడు లేకపోవడం.. ఎవరికివారు టికెట్ల గందరగోళంలో కూరుకుపోవడంతో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో అసమ్మతి నేతలుగా ముద్రపడ్డ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కి వ్యతిరేకంగా చేతులు కలిపారు.
2024ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ కి టిక్కెట్ ఇస్తే పనిచేసేది లేదనివారంతా అల్టిమేటం జారీ చేశారు. కొత్తవారికి టిక్కెట్ ఇస్తే అంతాకలిసి పనిచేసి గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. నరసన్నపేట నియోజకవర్గం పరిధిలోని నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాలకి చెందిన కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలు అంతా కూడా ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కృష్ణదాస్ వ్యవహార శైలితో తాము గుర్తింపు కోల్పోయామని నాయకులు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. అంతేకాదు.. ఆయన తీరును ఆక్షేపించారు.
ఈ సమావేశంలోసారవకోట ఎంపిపి చిన్నాల కూర్మినాయుడు, జలుమూరు జడ్పీటిసి ప్రతినిధి మెండ రాంబాబు, నరసన్నపేట మండలానికి చెందిన వైకాపా నాయకులు ముద్దాడ బాలభూపాల్నాయుడు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి పంగ బావాజీ నాయుడు, పోలాకి మండలం నుంచి మాజీ డిసిసిబి చైర్మన్ డోల జగన్, మాజీ ఎంపిపి తమ్మినేని భూషణలతో పాటు నియోజకవర్గంలోని వివిద ప్రాంతాలకి చెందిన ఎంపిటిసిలు, సర్పంచ్ లు కూడా పాల్గొన్నారు. సుమారు 200 నుంచి 250 మంది ఈ సమావేశానికి హాజరు కావడం స్థానికంగ కలకలం రేపింది.
గత 2019 ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన తమకు ఎలాంటి సాయం చేయలేదని వారు కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయనకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వవద్దని తీర్మానం చేయడం గమనార్హం. నాలుగు మండలాలకి చెందిన అసంతృప్త నేతలు అంతా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్తవారికి టిక్కెట్ ఇచ్చినా ఆ అభ్యర్ధి గెలుపుకోసం ఐక్యంగా కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. ధర్మాన కృష్ణదాస్ కి టిక్కెట్ ఇస్తే మాత్రం తాము సహకరించబోమని వారంతా తేల్చి చెప్పారు.
అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తాము భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ధర్మాన కృష్ణదాస్ వ్యవహార శైలి వల్ల నరసన్నపేటలో వైసీపీకి నష్టం వాటిల్లుతోందన్నారు. ఆయనకే టిక్కెట్ ఇస్తే పార్టీ దెబ్బతింటుందని.. తాము సహకరించేది లేదని తేల్చి చెప్పారు. వైసీపీ అధిష్టానం కొత్త అభ్యర్థికి నరసన్నపేట నుంచి టిక్కెట్ ఇవ్వాలని కోరారు. సీఎం జగన్ అంటే తమకి అభిమానమని, పార్టీ పట్ల గౌరవం ఉందని, ఇన్నాళ్లు క్రమ శిక్షణకి కట్టుబడి ఉన్నామన్నారు. మరి వీరి వాదనపై పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.