టికెట్ల వ్యవహారం విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వస్తోంది. వైసీపీలో టికెట్లు దక్కని వారు.. టీడీపీలో టికెట్లు దక్కనివారు.. చాలా మంది ఉన్నారు. వైసీపీలో టికెట్లు దక్కకపోయినా.. నాయకులు కొంత హర్ట్ అయినా.. వారిని పిలిచి బుజ్జగించడమో.. లేక వారి డిమాండ్లను పరిశీలించి.. రాజీ పడడమో వైసీపీలో జరుగుతోంది. ఉదాహరణకు తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వకపోవడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగారు. హైదరాబాద్లో మకాం వేశారు.
వెంటనే రంగంలోకి దిగిన వైసీపీ అధినేత జగన్.. ఆయనను బుజ్జగించేలా.. కోరుకున్న వరాలన్నీ .. ఇచ్చేశారు. 25 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న డిమాండ్ను ఒకే ఒక్క సంతకంతో ఓకే చేశారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులు లేవని అంటే.. నేను చూసుకుంటాను.. అని హామీ ఇచ్చారు. దీంతో బాలినేని దిగి వచ్చారు. ఇక, టికెట్ లేదని అలిగి వెళ్లిపోయిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా ఇదే పంథాలో వెనక్కి తీసుకువచ్చారు. మంత్రి పీఠం ఖాయమని చేతిలో చెయ్యేసి చెప్పేశారు.
మొత్తంగా.. కీలక నేతలకు టికెట్లు లేకపోయినా.. వైసీపీ వ్యూహానికి వారు దరిచేరారు. రేపు పార్టీకి పనిచేస్తా మని అంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. వైసీపీలో వారికి టికెట్లు రాకపోయినా.. పనిచేయా ల్సింది.. వైసీపీకే. వేరే పార్టీకి వారు పనిచేయాల్సిన అవసరం లేదు. సో.. వారికి ఇబ్బందికర పరిస్థితి లేదు. ఒకవేళ అలిగి పడుకున్నా.. ఆ ప్రభావం పెద్దగా అభ్యర్తిపై పడదు. స్వల్పంలో తేలిపోతుంది. ఇదే విషయాన్ని టీడీపీలో చూసుకుంటే.. టికెట్లు దక్కని వారు.. పార్టీలోనే ఉన్నా.. జంపింగు చేయమని అధినేతకు మాటిచ్చినా.. క్షేత్రస్థాయిలో వారు కదలే పరిస్థితి కనిపించడం లేదు.
ఎందుకంటే.. టికెట్ తమకు దక్కలేదంటే.. తమ సొంత పార్టీలోని మరో నాయకుడికి కూడా .. దక్కదనేది వారికి తెలుసు. వేరే పార్టీకి టికెట్ ఇస్తారు. పోనీ.. అది జనసేనకు అయితే.. అంతో ఇంతో కలుసుకొని పోవచ్చు. కానీ, ఇప్పటి వరకు టీడీపీ తో కలవకుండా.. వైసీపీపై ఎలాంటి యుద్ధం చేయకుండా.. ఎన్నికల కు ముందు చేతులు కలుపుతున్న బీజేపీ నేతల కోసం పనిచేయాలంటే.. ఆ జెండాలు మోయాలంటేనే అసలు సమస్య వస్తోంది. దీనిని ముందుగా చంద్రబాబు అర్దం చేసుకోవాలి. అలాగని పొత్తులు లేకుండా వెళ్లమని ఎవరూ చెప్పడం లేదు. కానీ, క్షేత్రస్థాయిలో తమ్ముళ్ల మానసిక, ఆర్థిక ఇబ్బందులను కూడా ఆయన పట్టించుకుంటేనే తప్ప.. ఫలితం దక్కేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.