ఇప్పటి వరకు ఇంచార్జ్లుగా నియమితులైన వారు వైసీపీలో ఎక్కడా ప్రశాంతంగా లేరు. ఏ క్షణమైనా మార్పులు ఖయమనే సంకేతాలు వచ్చాయి. వాస్తవానికి మార్పులు ఉండవని సీఎం జగన్ పదేపదే చెప్పారు. కానీ, మార్పులు అనివార్యంగా జరుగుతున్నాయి. ఎందుకంటే.. పోటీ అలా ఉంది. బలమైన కూటమి పక్షాలను ఎదుర్కొనాలంటే.. వ్యూహాలకు, ప్రతి వ్యూహాలు వేయాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో టికెట్ చేతిలో ఉన్నా.. కూడా నాయకులకు కంటిపై కునుకు లేకుండాపోయింది.
ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలను పరిశీలిస్తే.. అవనిగడ్డలో ముచ్చటగా మూడో కృష్ణుడి పేరు తెరపైకి వచ్చింది. ఈ స్థానం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ను పక్కనపెట్టి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను ఇన్చార్జిగా నియమించారు. ఆయన పోటీకి విముఖత చూపడంతో ఆయన తనయుడు రాంచరణ్ను తెరపైకి తెచ్చారు. తాజాగా టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్తో వైసీపీ నాయకులు మంతనాలు చేస్తున్నారని తెలిసింది. ఈయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన బయటకు వచ్చేందుకు రెడీ అయ్యారు.
ఇక, మైలవరానికి సర్నాల తిరుపతిరావును ప్రకటించారు. ఈయన చివరి వరకు బరిలో ఉండటం అనుమానమే నని సొంత పార్టీ శ్రేణులే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడి నుంచి జోగి రమేశ్, వల్లభనేని వంశీ పేర్లతోపాటు లకిరెడ్డి బాలరెడ్డి సోదరుడు హనిమిరెడ్డి కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
పెడన నుంచి ఉప్పాల రాము పేరు ప్రకటించగా ఆయన టికెట్ కూడా అనుమానమేనంటున్నారు. ఈ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ బూరగడ్డ వేదవ్యాస్ను వైసీపీలోకి ఆహ్వానించి ఆయనకు పెడన టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రకటించిన స్థానాల్లో విజయవాడ సెంట్రల్ నుంచి వెలంపల్లి శ్రీనివాసరావు, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామి దాసు, మచిలీపట్నం నుంచి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు, పెనమలూరు నుంచి జోగి రమేశ్ మాత్రమే చివరి వరకు బరిలో నిలిచే అభ్యర్థులుగా ఉన్నారు.