వైసీపీలో తీవ్ర కలకలం రేగుతోంది. ఎన్నికలకు సమయం వచ్చేయడం.. పార్టీ అభ్యర్థుల విషయంలో ఇంకా మార్పులు కొనసాగుతుండడంతో నాయకులు, కార్యకర్తలు కూడా ఇదేం ప్రయోగం అని రచ్చ చేసుకుంటు న్నారు. అంతేకాదు.. ఒకవైపు టీడీపీ-జనసేన బలంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుని చేతులు కలిపాయని.. సభలు కూడా పెడుతున్నాయని.. ఇలాంటి సమయంలో ఇంకా కీలక నేతలను మార్చేయడం ఏంటని.. నాయకులు చర్చించుకుంటున్నారు.
అటు చూస్తే బలమైన మిత్రపక్షం చేతులు కలిపింది. అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇలాంటి సమ యంలో అంతకన్నా బలమైన వారికి ఇక్కడ అవకాశం ఇవ్వాలి. కానీ, కొత్తముఖాలకు ఇస్తే.. ఎలా ఓడిస్తాం. ఎలా కలిసినడుస్తాం` ఇదీ. ఇప్పుడు కొత్తగా వైసీపీలో వినిపిస్తున్నారు. సాధారణంగా ఎక్కడైనా రాజకీయ సభ పెడితే.. దీనిపై వెంటనే పొరుగు పార్టీల నుంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా వైసీపీ నాయకులు తమ శైలిలో విమర్శలు గుప్పిస్తారు.
కానీ, తాజాగా టీడీపీ-జనసేన మిత్రపక్షం నిర్వహించిన జెండా సభలపై వైసీపీ నుంచి ఒకటి రెండు మిన హా పెద్దగా ఎక్కడా కామెంట్ల రొద కనిపించలేదు. వినిపించలేదు. దీనికి ప్రధాన కారణం.. తాము కూడా ఈ సభ సక్సెస్ను అంగీకరిస్తున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. జెండా సభకు పోటెత్తిన జనమే మార్పు దిశంగా రాష్ట్రం అడుగులు వేస్తోందనే భావన వైసీపీలోనూ కలుగుతుండడం సీనియర్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.
ఇదే విషయంపై క్షేత్రస్థాయిలో నాయకులు చర్చ చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన 8వ జాబితాలోనూ ఇంకా ప్రయోగాలు చేయడం.. వారసులకు టికెట్లు ఇవ్వడం బంధు ప్రీతిని చాటు కోవడం వంటివి పెద్ద సంచలనంగా మారనున్నాయని వైసీపీ అధిష్టానం భావించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకున్న నాయకులకు అన్యాయం చేయడం కాదా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. అందుకే.. పుట్టి మునిగిపోతున్నా. ప్రయోగాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.