కోవిడ్ లాక్డౌన్ అనంతరం ఎట్టకేలకు దేశంలోని పర్యాటక ప్రాంతాలు మళ్లీ టూరిస్టుల కోసం ఓపెన్ అవుతున్నాయి. ఇటీవలే గోవా ప్రభుత్వం కేవలం దేశీయ టూరిస్టులకు మాత్రమే మళ్లీ స్వాగతం పలకగా.. ఇప్పుడు అదే జాబితాలో జమ్మూ కాశ్మీర్ వచ్చి చేరింది. జూలై 14 నుంచి జమ్మూ, కాశ్మీర్లలో పర్యాకులను మళ్లీ అనుమతించనున్నారు. అది కూడా కేవలం పరిమిత సంఖ్యలోనే టూరిస్టులకు అనుమతి ఇవ్వనున్నారు. కేవలం వాయు మార్గంలో వచ్చే ప్రయాణికులకు మాత్రమే అక్కడికి అనుమతి ఉంటుంది. ఇక జమ్మూ, కాశ్మీర్లలోకి అడుగు పెట్టేవారు కచ్చితంగా ఆర్టీ-పీసీఆర్ కరోనా టెస్టులు చేయించుకోవాలి. అలాగే హోటళ్లలో రూంల బుకింగ్ కన్ఫాం అయిన వారినే అక్కడికి అనుమతిస్తారు.
జమ్మూ, కాశ్మీర్లకు వెళ్లాలనుకునే పర్యాటకులు ఈ మార్గదర్శకాలను పాటించాలి…
* కేవలం వాయు మార్గంలో వచ్చే పర్యాటకులకు మాత్రమే జమ్మూ, కాశ్మీర్లలోకి అనుమతిస్తారు. తక్కువ సంఖ్యలో పర్యాటకులకు మాత్రమే తొలి దశలో అనుమతి ఉంటుంది.
* పర్యటనలో ఉన్నంత కాలం హోటళ్లలో కన్ఫాం అయిన రూమ్స్ బుకింగ్ కలిగి ఉండాలి.
* జమ్మూ, కాశ్మీర్లకు వెళ్లేవారు అక్కడ పర్యటన అనంతరం మళ్లీ దేశంలో ఏదైనా ప్రాంతానికి వెళ్లేందుకు వారు ముందుగానే రిటర్న్ టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పర్యటన ఆరంభంలోనే వాటిని చూపించాలి.
* జమ్మూ, కాశ్మీర్లకు వచ్చే పర్యాటకులకు కచ్చితంగా కరోనా టెస్టులు చేస్తారు. నెగెటివ్ వస్తే ఓకే.. పాజిటివ్ వస్తే కోవిడ్ చికిత్స తీసుకోవాలి.
* ఎయిర్పోర్టు నుంచి హోటల్స్కు, హోటల్స్ నుంచి ఎయిర్పోర్టుకు, ఇతర ప్రదేశాలకు పర్యాటకులు ముందుగానే ట్యాక్సీలను బుక్ చేసుకోవాలి.
* 65 సంవత్సరాలకు మించిన వారు పర్యటించడానికి రాకూడదు.
* హోటళ్లు, హౌజ్ బోట్లు, గెస్ట్ హౌజ్లలో ఉండేందుకు పర్యాటకులు ముందుగానే రూమ్లను బుక్ చేసుకోవాలి. పర్యాటకులు జమ్మూ కాశ్మీర్కు రాగానే ఆ వివరాలతోపాటు వారి ఐడీ వివరాలను చెక్ చేస్తారు.
* జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం శాఖ వెబ్సైట్లో అక్కడి హోటళ్లు, ట్రావెల్స్ ఏజెన్సీల వివరాలను అందుబాటులో ఉంచారు.
* పర్యాటకులు అన్ని ప్రదేశాల్లోనూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.
* పర్యాటకులు తమ ఫోన్లలో కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. అందులో వారి స్టేటస్ సేఫ్ అని ఉండాలి.