పదిహేనేళ్లకే గర్భం దాల్చిన బాలిక విషయం వెలుగులోకి వచ్చిన మరునాడే శవమై తేలింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నానమ్మ, తాతయ్య వద్దే ఉంటున్న ఆ బాలిక గర్భం దాల్చడానికి కారకులెవరో.. మృతి చెందడానికి కారణమేంటో మిస్టరీగా మారిపోయింది. ఈ రెండు ఘటనలను తండ్రి, తాతయ్య, నానమ్మ.. బాలిక తల్లికి ఎందుకు తెలియనివ్వలేదు. అంతుచిక్కని ఈ మిస్టరీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాగేశ్వర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాలిక తల్లిదండ్రులు గొడవలు పడి విడివిడిగా ఉంటున్నారు. దీంతో బాలిక నానమ్మ, తాతయ్య వద్దే ఉంటోంది. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిక్ష చేసిన వైద్యుడు బాలిక అయిదు నెలల గర్భవతి అని చెప్పి బాగేశ్వర్ లోని పెద్దాసుపత్రి తీసుకెళ్లాలని సూచించాడు. కానీ.. వీరు ఇంటికొచ్చి తండ్రికి విషయం తెలిపారు. పెళ్లి కాకుండా తల్లైనందుకు బాలికను తండ్రి తీవ్రంగా మందలించాడు. అయితే.. ఆ మరునాడే బాలిక శవమై తేలింది. విషయం బయటకు పొక్కకుండా తండ్రి, నానమ్మ, తాతయ్య ఆమెకు అంత్యక్రియలు చేసేశారు. అయితే..
ఇప్పటివరకూ జరిగిన తంతు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తల్లికి తెలియనివ్వలేదు. మొత్తానికి విషయం తెలిసిన తల్లి గుండెలవిసేలా రోదించింది. కూతురు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పూడ్చిపెట్టిన బాలిక మృతదేహాన్ని వెలికి తీయించి పోస్ట్ మార్టంకు పంపించారు. బాలిక గర్భం, మృతి చెందడానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.