2015 జూలైలో హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన ఎంతో మంది హృదయాలను తొలిచివేసింది. ఒక అమ్మాయి తన కన్నతండ్రి మరియు సవతి తల్లి చేతుల్లో చిత్రహింసలకు గురైంది. ఆ అమ్మాయి పేరు ప్రత్యూష. వారి ఇద్దరి చేతుల్లో తీవ్ర గాయాలపాలైన ప్రత్యూషను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అప్పటిలో ఈ విషయంపై మీడియాలో ఎన్నో కథనాలు ప్రసారం అయ్యాయి.
ప్రత్యూష గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చలించిపోయి ప్రత్యూషను పరామర్శించి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. అదే సమయంలో ప్రత్యూషను తన దత్త పుత్రికగా కెసిఆర్ ప్రకటించారు. ఆ అమ్మాయి హాస్పిటల్ లో కోలుకున్న తర్వాత ప్రగతి భవన్లోని తన ఇంటికి ఆహ్వానించారు కేసీఆర్. అప్పుడు ఆమె ఉన్నత చదువు చదవాలని కోరుకుంటున్నట్లు చెప్పడంతో కెసిఆర్ అంగీకరించి తానే పెళ్లి కూడా చేస్తానని అన్ని రకాలుగా సాయంగా ఉంటానని అప్పట్లో కేసీఆర్ భరోసా ఇచ్చారు.
ప్రత్యూష నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ దత్తపుత్రిక అయిన ప్రత్యూష వివాహ వేడుకకు మూహూర్తం ఖరారైంది. ఈనెల 28న రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ గ్రామంలోని లుర్దూ మాత దేవాలయంలో ఆమె వివాహం జరగనున్నది. కొద్దిరోజుల క్రితమే ప్రత్యూషకు నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ విద్యానగర్లోని ఓ హోటల్లో నిరాడంబరంగా ఆమె నిశ్చితార్థం జరిగింది.
ఉడుముల జైన్ మేరీ-మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డితో ప్రత్యూష వివాహం ఖరారయ్యింది. మమత మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్రెడ్డి ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రత్యుష తాను కోరుకున్న యువకుడితో జీవితాన్ని పంచుకోబోతోంది. ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి అయిన చరణ్ ప్రత్యూషకు కొత్త జీవితం ఇచ్చేందుకు ఇష్టపూర్వకంగా ముందుకొచ్చినట్లు చెప్పాడు.
సీఎం కెసిఆర్ అండతో ఈ రోజు ఇలా జీవితంలో నిలబడగలిగానని మరియు పెళ్లి బంధంతో మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ప్రత్యూష చెప్పింది.