పాతబస్తీ కేంద్రంగా ఉన్న ఏఐఎంఐఎం గత కొద్దికాలంగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న సంగతి తెలిసిందే. పార్టీ రథసారథి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రంలో ముస్లింల ఓట్లు బలంగా ఉన్న చోట తన సత్తా చాటుతున్నారు.
ఏఐఎంఐఎంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్లు చేశారు. M.I.M బీజేపీకి బీ టీమ్లా మారిందని విమర్శించారు. ఓట్లను చీల్చడానికి బీజేపీ కోట్లు వెచ్చించి హైదరాబాద్ నుంచి పార్టీని తీసుకొస్తోందని విమర్శించారు. దీనివల్ల హిందూ ఓట్లు బీజేపీకి, ముస్లీం ఓట్లు హైదరాబాద్ పార్టీకి వెళ్లేలా కుట్ర పన్నారని ఆరోపించారు. మొన్నటి బీహార్ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని మమత ఆరోపించారు.
అసద్ ఆగ్రహం
బెంగాల్ సీఎం మమత వ్యాఖ్యలకు అసద్ కౌంటర్ ఇచ్చారు. తనని కొనేవాళ్లు ఇంకా పుట్టలేదని అన్నారు. ఇప్పటి వరకు మీ చెప్పు చేతల్లో ఉండే నేతల్నే చూశారని, ముస్లింల కోసం మాట్లాడే నేతల్ని చూడలేదన్నారు. బీహార్లో ముస్లిం ఓటర్లను ఇలాగే అవమానించారు. ముస్లింలు మీ జాగీర్ కాదు అని అసద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీ హుజూర్ అనేవాళ్ల మాటల్నే మమత వింటుందని అసద్ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజారి మాట్లాడకూడదన్నారు. ముందు మీ ఇళ్లు సక్కదిద్దుకోవాలని సూచించారు. టీఎంసీ నుంచి నేతలు వెళ్లిపోతున్నారనేది తెలుసుకోండి. అని వ్యాఖ్యానించారు.
ఎంఐఎం పై ఆమె ఎందుకు ఫైరయింది?
ఎంఐఎం రథసారథి అసదుద్దీన్ పై మమతా బెనర్జీ ఫైర్ అవడం వెనుక ఆసక్తికర కారనాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన సత్తా చాటి ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్, ఆర్జేడీ ఓట్లను దారుణంగా చీల్చింది. దీనికి కొనసాగింపుగా , బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు మొదలు పెట్టింది. ఎందుకంటే, కశ్మీర్ తర్వాత ముస్లీం ఓట్లు అత్యధిక ఉన్న రాష్ట్రం బెంగాల్. ఇక్కడ వందకు పైగా నియోజకవర్గాల్లో ముస్లీం ఓట్లు కీలకం. 2016 ఎన్నికల్లో ముస్లీంల ఓట్లు గంపగుత్తగా టీఎంసీకి పడ్డాయి. బీహార్ విజయంతో బెంగాల్పై కన్నేసిన అసద్ ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంటే… అసదుద్దీన్ ఓవైసీ చాపకింద నీరులా సైలెంట్గా తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో బెంగాల్ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలపై చర్చించారు. దీంతో టీఎంసీలో ఆందోళన మొదలైంది. ఎంఐఎం కూడా బరిలోకి దిగుతుండటంతో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉందని టీఎంసీ నేతలు భావిస్తున్నారు . దాని ఫలితమే దీదీ కామెంట్లు అని పలువురు చెప్తున్నారు.