(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమరావతి: పెంచిన ఆర్టిసి బస్సు చార్జీలను ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. ఆర్టిసి చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మాట తప్పుతూనే ఉన్నారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలపై భారాలు వేయము అని గొప్పలు చెప్పారని అన్నారు. ఒకవైపు ఉల్లి కనీళ్లు పెట్టిస్తుంటే మరొకవైపు ఆర్టిసి చార్జీలు పెంచడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు.
ఆర్టిసి చార్జీలు పెంచడం అంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఆర్ధికంగా కుంగతీయడమేనని ఆయన అన్నారు. ప్రజల సంపాదనలో సగం చార్జీలు చెల్లించడానికే సరిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం పెంచిన చార్జీలను తగ్గించాలని బాబూరావు డిమాండ్ చేశారు.