న్యూఢిల్లీ: దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్పై రిటైర్డ్ జడ్జితో విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్ ను బుధవారం అత్యున్నత న్యాయస్థానం విచారించింది. దిశా నిందితుల ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని సుప్రీం పేర్కొంది. రిటైర్డ్ జడ్జి ఢిల్లీ నుంచే దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసును విచారిస్తారని తెలిపింది. దర్యాప్తుపై సలహాలు, సూచనలతో రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.
తెలంగాణ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తమ వాదనలు విన్న తర్వాతే ముందుకు వెళ్లాలని రోహత్గీ ధర్మాసనాన్ని కోరారు.
దిశ హత్య కేసులో నిందితులైన నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం ఘటనా ప్రదేశానికి నిందితులను తీసుకెళ్లగా, వారు తిరగబడ్డారని ఆత్మ రక్షణ కోసం వారిని చంపాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని కొందరు మానవ హక్కుల ఉద్యమ కారులు తెలంగాణ హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దిశా నిందితుల ఎన్కౌంటర్పై జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఈ కేసులో నలుగురు నిందితులను ఉద్దేశపూర్వకంగా కాల్చి చంపి ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తున్నారని.. ఈ ఘటనపై విచారణ జరిపించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీతో పాటు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను ప్రతివాదులుగా చేర్చారు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల బృందంతో విచారణ జరిపించాలని కోరారు.