దుబ్బాక ఉప ఎన్నికలోనూ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో ఊపు మీదున్న తెలంగాణ బీజేపీకి ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు ఒకరు షాక్ ఇచ్చారు.ఈ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.
వివరాల్లోకి వెళితే ..మహబూబ్నగర్ బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎర్ర శేఖర్ రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటన సందర్భంగా జరిగిన కొన్ని పరిణామాలతో కలత చెంది ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.ఎర్ర శేఖర్స్వయంగా మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి తన రాజీనామా విషయాన్ని తెలిపారు.ఇందుకు దారితీసిన కారణాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన మీడియాకు చెప్పారు.అయితే రాజకీయ వర్గాల్లో సాగుతున్న ఊహాగానాల ప్రకారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనకి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఎర్రశేఖర్ రాజీనామా చేశారంటున్నారు.
ఎర్ర శేఖర్ నిర్ణయం వెనక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటన కారణమన్న ప్రచారం ఊపందుకుంది .జిల్లా పర్యటనకు వచ్చిన బండి సంజయ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఆ సమయంలో తనకు కాస్త అవమానం జరిగినట్టు ఆయన భావిస్తున్నారని ప్రచారం ఉంది. తరువాత ప్రెస్ మీట్ విషయంలోనూ ఎర్ర శేఖర్ అభిప్రాయాన్ని పట్టించుకోలేదు సీనియర్లు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షుడి ప్రెస్ మీట్ చివరి క్షణంలో క్యాన్సల్ అయ్యేలా చేశారు.
బీజేపీ సీనియర్ నేతల కారణంగానే ప్రెస్ మీట్ క్యాన్సల్ అయినట్టు ఆయన భావిస్తున్నారు.మొత్తంగా చూస్తే జిల్లా అధ్యక్షుడైన ఎర్రశేఖరు ని బండి సంజయ్ పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తోంది ఈ వరుస ఘటనలతో తీవ్ర మనస్తాపానికి లోనైన శేఖర్ రాజీనామా చేసినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. జిల్లా బీజేపీలో సీనియర్ నేతలకు, కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులకు మధ్య పొసగడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయమై ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.