గుంటూరు, ఏప్రిల్ 13: వైసిపి కార్యకర్తలపై నమోదు చేసిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మంగళగిరి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధర్నా చేశారు. వైసిపి కార్యకర్తలు, నేతలతో కలిసి రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట భైటాయించారు. తాము చేసిన ఫిర్యాదులను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆళ్ల డిమాండ్ చేస్తున్నారు.
గురువారం రాత్రి తాడేపల్లి క్రిస్టియన్పేట పోలింగ్ కేంద్రంలో ఇవిఎంలు పని చేయక పోలింగ్ జాప్యం జరుగుతున్న విషయం తెలుసుకుని టిడిపి అభ్యర్థి, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అక్కడకు చేరుకోగా వైసిపి శ్రేణులు దాడికి పాల్పడ్డారు. తనపైనే దాడి చేస్తారా అంటూ ఆ సమయంలో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ భైటాయించి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఆ ఘటనకు సంబంధించి వైసిపి కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు.
దీనిపై శనివారం వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యకర్తలతో కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై తప్పుడు ఫిర్యాదులతో కేసులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ ఆర్కె ఆరోపిస్తున్నారు.