ద హేగ్: ఐవీఎఫ్ పద్ధతిలో పిల్లలను కందామని వచ్చిన వారిని ఓ వైద్యుడు మోసం చేశాడు. చికిత్స చేయాల్సింది పోయి.. తన వీర్యంతో ఏకంగా 49 మంది పిల్లలను అతడు కన్నాడు. 2017లోనే మరణించిన జాన్ కార్బాట్ అనే ఆ వైద్యుడికి సంబంధించిన ఆసుపత్రి ఇప్పుడు మూతపడింది. రాటర్ డ్యాంలోని అతడి ఆసుపత్రికి సంతాన సాఫల్య చికిత్సల కోసం మహిళలు వచ్చినపుడు వారికి వారు కోరుకున్న వీర్యదాతల వీర్యంతో కాకుండా, తన సొంత వీర్యంతో పిల్లలను పుట్టించేవాడని తెలిసింది. నెదర్లాండ్స్ లోని ఆగ్నేయప్రాంతంలో ఉన్న ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్షలు చేయించగా, మొత్తం 49 మంది పిల్లలు నేరుగా కార్బాట్ వారసులేనని స్పష్టమైంది.
దాంతో తన ఆస్పత్రిలో సొంత వీర్యాన్నే అతడు ఉపయోగించినట్లు తీవ్రమైన అనుమానాలు నిర్ధారణ అవుతున్నాయని పిల్లల తరఫున వాదిస్తున్న న్యాయవాది చెప్పారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా డీఎన్ఏ పరీక్షల ఫలితాలు ఇవ్వాలని డచ్ కోర్టు తేల్చిచెప్పింది. ఆసుపత్రిలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో 2009లోనే క్లినిక్ మూసేసిన కార్బాట్.. తన 89వ ఏట మరణించాడు. అంతకుముందు అతడు తాను 60 మంది పిల్లలకు తండ్రినని ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది. తన వీర్యాన్ని వివిధ దాతల వీర్యంతో కలిపేసి, వారికి డోనార డాక్యుమెంటేషన్లు ఇచ్చినట్లు కూడా అంగీకరించాడు. దాంతో ‘కార్బాట్ పిల్లల’ గ్రూపు అతడి కుటుంబ సభ్యులను కోర్టుకు లాగి, కార్బాట్ డీఎన్ఏ ప్రొఫైల్ ఇచ్చేలా చేశారు.
అయితే తమ క్లయింట్ల వివరాలు బయటపెట్టకూడదని కార్బాట్ కుటుంబ లాయర్లు వాదించారు. కార్బాట్, అతడి కుటుంబం కంటే పిల్లల హక్కులు ముఖ్యమని ఈ సందర్బంగా జడ్జి చెప్పారు. ఇప్పుడు ఇన్నేళ్ల అస్పష్టత తర్వాత.. చివరకు ఒక అధ్యాయం ముగిసిందని, వాళ్లంతా కార్బాట్ వారసులేనని లాయర్లు తెలిపారు. అయితే, అతడు తన తల్లిని మోసం చేశాడన్న కోపం ఏమీ లేదని పిల్లల్లో ఒకరైన ఎరిక్ లీవర్ అన్నారు. ఆమెకు తన సొంత తండ్రితో పిల్లలు పుట్టకపోవడంతో ఎలాగైనా ఓ బిడ్డ కావాలనుకుందని చెప్పారు.